ఆళ్లగడ్డ: స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మరో ఆరుగు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టలేదు.
ప్రస్తుతం అఖిల ప్రియతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, మిగిలిన ఇద్దరు భూమా వర్గీయులేవే కావడంతో భూమా అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 8న ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక జరుగనుంది. 12వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాగా, తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కొద్ది రోజుల క్రితం.. తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో చెప్పారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు.
అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.