దువ్వాడ జగన్నాథమ్: రూటు మారిన తెలుగు సినిమా, ఆంధ్ర పొలిటికల్ ఫైట్
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమా ద్వారా తెలుగు సినిమా రూటు మారే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఎపి రాజకీయాలతో ఆ సినిమాకు ముడి పెడుతున్నారు.
విజయవాడ: మాస్ మసాలా సినిమా అని భావించిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ రాజకీయ వివాదాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సినిమాపై తొలుత బ్రాహ్మణులు అభ్యంతరం చెప్పినప్పటికీ సినిమా చూసిన తర్వాత వారు సంతోషించే అంశాలే ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
సినిమా కథనమంతా భూమి సమస్య మీదనే నడుస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో బలమైన సామాజికవర్గాన్ని సినిమా లక్ష్యం చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా చూస్తే అగ్రి గోల్డ్ వ్యవహారం వెంటనే గుర్తుకు వస్తుంది. సినిమాలోని ప్రతినాయకుడు రొయ్యలనాయుడికి చెందిన సంస్థ అగ్రి డైమండ్ కావడం వల్ల కూడా అది తలంపునకు వస్తుంది.
అగ్రి గోల్డ్ వ్యవహారాన్ని చెప్పడానికే ఉద్దేశించామని గుర్తు చేయడానికే ఆ పేరు పెట్టారా అనేది తెలియదు. మొత్తంమీద, అగ్రి గోల్డ్ వ్యవహారం కేంద్ర బిందువైనట్లుగా చెప్పవచ్చు. ఆ వ్యవహారంలో మాదిరిగానే సినిమాలో కూడా భూమి ఒక సామాజికవర్గం చేతుల్లోంచి మరో సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్తుంది.
ఆంధ్ర రాజకీయాల ఫైట్....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు బలమైన సామాజిక వర్గాలున్నాయి. అవి కమ్మ, రెడ్డి, కాపు. ఇప్పటి వరకు రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని పంచుకున్నారని, కాపులు అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే సినిమాలో అధికారంలో ఉన్న సామాజికవర్గాన్ని లక్ష్యం చేసుకున్నట్లు భావిస్తున్నారు.
నేరుగానే....
సినిమాలో కమ్మ విషయానికి సంబంధించిన సన్నివేశం యాదృచ్ఛికంగానే వచ్చినట్లు కనిపించినప్పటికీ అసలు విషయాన్ని చెప్పాలనే ఉద్దేశమే కనిపిస్తోందని అంటున్నారు. పైన అమ్మవారు.... కింద కమ్మవారు అనే డైలాగ్ రావడానికి ముందు కాస్తా వివరమైన చర్చనే సాగుతోంది. ఆ సామాజికవర్గాన్ని సినిమాలో టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ జనసేన
పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా రావడం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల డిమాండుతో కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ను బిజెపి పవన్ కల్యాణ్కు విరుగుడుగా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఐవైఆర్ కృష్ణారావు ఇష్యూ....
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఐవైఆర్ కృష్ణారావు పోరాటంతో సినిమాకు ఏ విధమైన సంబంధం లేదు. కానీ, సినిమా చూసిన తర్వాత ఆ విషయం స్మరణకు రావడం యాదృచ్ఛికమేమీ కాకపోవచ్చు. కృష్ణారావు తన ఫేసుబుక్ వ్యాఖ్యల్లో పరోక్షంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యం చేసుకున్నట్లు అనిపిస్తుంది. దానివల్ల దువ్వాడ జగన్నాథమ్ సినిమా చూసిన తర్వాత కృష్ణారావు ఉదంతం గుర్తుకు వస్తుంది.
రూటు మారిన సినిమా....
దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తెలుగు సినిమా రూటు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత తెలంగాణను, ఆ తర్వాత రాయలసీమను తెలుగు సినిమా టార్గెట్ చేసుకున్నట్లు చెబుతారు. గాయం సినిమా తెలంగాణ పాలక వర్గాన్ని లక్ష్యం చేసుకోవడం తెలిసిందే. తెలంగాణను తెలుగు సినిమా కించపరిచిందనే విమర్శ తెలంగాణ ఉద్యమ కాలంలో బలంగా వినిపించింది. ప్రేమించుకుందాం, రా... వంటి సినిమాల ద్వారా రాయలసీమ పాలకవర్గాలను టార్గెట్ చేసిందనే విమర్శలు వచ్చాయి.
ఎందుకలా....
తెలంంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న సామాజిక వర్గాలే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడుతున్నాయి. ఆ రెండు సామాజికవర్గాలతో కాపు సామాజిక వర్గం పోటీ పడడానికి సిద్దమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కమ్మ, కాపు సామాజికవర్గాలు అధికారం కోసం పోటీ పడే పరిస్థితి లేదు. దీంతో ఆంధ్ర ప్రాంంతానికి చెందిన రెండు బలమైన సామాజిక వర్గాలు ఆంధ్ర ప్రాంతానికి తన కథావస్తువను తీసుకుని వెళ్లే క్రమంలో భాగంగానే దువ్వాడ జగన్నాథమ్ సినిమా వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఆ రకంగా తెలుగు సినిమా రూటు మారిందనే అభిప్రాయాన్ని ఈ సినిమా కల్పిస్తోంది.