ఏపీ, టీ: మహానాడు వేదికగా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ఆకట్టుకుంటోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం పెట్టారు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది.
టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం.. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్ల వంటివని చెబుతారు. దానికి అనుగుణంగా ఓ వైపు అమరావతి, మరోవైపు కాకతీయ తోరణం పెట్టడం గమనార్హం.
దీని పైన చంద్రబాబు స్పందించారు. మహానాడులో ఓ వైపుకు అమరావతిని, మరో వైపు కాకతీయ తోరణం పెట్టారని, ఇది సంతోషమన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ విధానమని చెప్పారు. రెండు ప్రాంతాలు మనకు సమానమన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు బుధవారంనాడు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. యేటా టిడిపి మహానాడు ఇవే తేదీల్లో జరుగుతాయి. వేదికపై తెలంగాణకు చెందిన కాకతీయ స్తూపం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలను ఉంచారు.
తన అధ్యక్షోపన్యాసంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని ఆయన చెప్పారు. విభజనను కోరుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిందేనని, అయితే ఆంధ్రకు న్యాయం చేయాలని తాను అంటూ వచ్చానని ఆయన అన్నారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేసే విషయంపై ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను చేపడుతున్న కార్యక్రమాలపై ఎక్కువగా ప్రస్తావించారు.
రాజధాని అమరావతి గురించి, నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. విభజన తీరును ఆయన ఆయన తప్పు పట్టారు.