ప్రపంచ బ్యాంకు బృందంకు వారి ఫిర్యాదు, బాబును ఆదుకున్న రాజధాని రైతులు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తమ జీవన ప్రమాణాలు పెరిగాయని పలువురు రైతులు ప్రపంచ బ్యాంక్ బృందంతో చెప్పారు. రాజధానికి భూములు తీసుకోవడం, నిర్మాణం, సీఆర్డీయే తీసుకుంటున్న చర్యల పైన సంతృప్తిగా ఉన్నట్లు వివిధ గ్రామాలకు చెందిన కొందరు రైతులు చెప్పారు.
అమరావతి నిర్మాణ వ్యయంలో దాదాపు రూ.6800 కోట్లను రుణంగా ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే రాజధాని రూపకల్పన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చాయని ఆరోపిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు బృందానికి కొందరు ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో రాజధాని అనుకూల రైతులు బుధవారం విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా వారుు రాజధాని పైన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
రాజధాని కారణంగా తమ జీవనగతిలో ఆహ్వానించదగిన పలు పరిణామాలు చోటు చేసుకున్నాయని, తమ నుంచి భూములను సమీకరించినప్పుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం, సీఆర్డీయే అమలు పరుస్తోందని, అలాంటప్పుడు రాజధానికి ఇవ్వాలని నిర్ణయించిన రుణాన్ని వెంటనే విడుదల చేసి, అమరావతి రూపకల్పనకు సహకరించాలని కోరారు. కొందరి మాటలు నమ్మి రుణంపై తాత్సారం చేయవద్దన్నారు.
అలా చేస్తే రాజధాని నిర్మాణ ప్రక్రియ కుంటుపడి, ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కొద్దిమంది ఆరోపిస్తున్న విధంగా అమరావతి ల్యాండ్పూలింగ్ ప్రక్రియలోనూ, రాజధాని స్థల నిర్ధారణలోనూ ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారన,ి ఇప్పటికే తమ భూముల విలువలు కొన్ని రెట్లు పెరిగి, తమ జీవన ప్రమాణాలు అనూహ్యంగా మెరుగుపడ్డాయన్నారు.