రాజధానిపై ఒత్తిడి లేకుండా, ఢిల్లీలా: సింగపూర్ ప్లాన్
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పైన ఒత్తిడి తగ్గించేందుకు దీని చుట్టుపక్కల ప్రాంతాన్ని మౌలిక వసతుల పరంగా రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని రాజధాని ప్రణాళిక రూపొందిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఢిల్లీ చుట్టూ నోయిడా, గుర్ గావ్ తరహాలో అమారావతి చుట్టు మంగళగిరి, విజయవాడ, గన్నవరం వాటి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించింది. సీఆర్డీఏ పరిధిని ఎనిమిది ప్రణాళిక ప్రాంతాలుగా విభజించింది. ఇందులో రాజధాని నగరం కూడా కలిసి ఉండే మధ్య ప్రాంతాన్ని కేంద్ర ప్రణాళికా ప్రాంతంగా గుర్తించింది.
ఇది 854 చ.కి.మీ. ఉంటుంది. ఇందులో రాజధాని నగరం 219 చ.కి.మీ. ఇది కాకుండా విజయవాడ 62.17 చ.కి.మీ., మంగళగిరి 4.29 చ.కి.మీ., గన్నవరం, విమానాశ్రయం కలిపి 4.29 చ.కి.మీ. కేంద్ర ప్రణాళిక పరిధిలో ఉంటాయి. మొత్తం ఈ పరిధిలో రాజధాని సహా ఇతర నగర, పట్టణ ప్రాంతం ఉంటుంది.
ఇందులో రాజదాని నగరం చుట్టూ కొంత ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఎక్కువ భాగం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. రాజధాని నగరంలో మినహా మిగిలిన కేంద్ర ప్రణాళిక ప్రాంతంలో ఎక్కడా ప్రభుత్వపరంగా భారీ నిర్మాణాలు ఉండవు.
అయితే, విశాల రహదారులు, మంచినీరు, మురికి నీటి పారుదల, టెలికాం వ్యవస్థలు కల్పిస్తారు. కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకు వస్తారు. రాజధాని నగరంపై ఒత్తిడి లేకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రతిపాదించింది.
దీని కోసం ప్రత్యేకంగా భూసమీకరణ లేదా సేకరణ చేపట్టారు. కేవలం కృష్ణా నది ఒడ్డున కృష్ణా జిల్లా పరిధిలో పర్యాటకం కోసం కొంత భూమిని సేకరిస్తారు. ఇది కేంద్ర ప్రణాళిక పరిధిలోకి వస్తుంది. రాజధాని అభివృద్ధి క్రమంలో నాలుగు సీఆర్డీఏ, కేంద్ర రాజధాని ప్రణాళిక ప్రాంతం, రాజధాని నగరం, ప్రభుత్వ కార్యాలయాలు ఉడే ప్రాంతాలుగా ప్రణాళికలు ఉండనున్నాయి.
రాజధాని నగరంలో కాలి బాటలు, సైకిల్ మార్గాలు నిర్మిస్తారు. ఇవి ప్రణాళికా బద్ధంగా ఉండనున్నాయి. కాగా, రాజధాని అమరావతి నిర్మాణానికి జూన్ ఆరో తేదిన భూమి పూజ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంను పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది కరకట్టకు అనుకొని ఇది ఉంది. ఇది కాకుండా వెంకటపాలెం సమీప ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు.