'ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా లేదా అనే భయం, చంద్రబాబు వల్లే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా లేదా అనే భయం పట్టుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్థత, అశ్రద్ద వల్లనే ఇదంతా జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో తిరగడానికి చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా పైన చూపలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ప్రజలను మభ్యపెట్టాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలు తెలుగు ప్రజలకు ఇప్పుడు మొండిచేయి చూపారన్నారు. ముందుగానే కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. చంద్రబాబు, వెంకయ్యల రంగులు మెల్లిగా వెలిసిపోతున్నాయన్నారు. బాబుకు వ్యక్తిగత ప్రయోజనాలో ముఖ్యమన్నారు.
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని ఏపీ మంత్రి పీతల సుజాత అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు సరిపోవన్నారు. ఇలా అయితే వందేళ్లయినా పూర్తి చేయలేమన్నారు.
హామీలిచ్చి ఏపీ నోట్లో మట్టికొట్టారు: ఆనం
విభజన చట్టంలో ఏపీకి ఎన్నో హామీలిచ్చిన కేంద్రం బడ్జెట్లో కొచ్చేసరికి ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టిందని కాంగ్రెస్ నేత ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరులో అన్నారు.
బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పట్టణంలోని మైపాడు గేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్వంలో ఆందోళన నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. ఏపీని చిన్నచూపు చూస్తున్నారన్నారు.