అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు వంశంలోనే పిచ్చి ఉందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు.
చంద్రబాబు వంశంలోనే పిచ్చి ఉందని, వైయస్ వంశంలో కాదని అన్నారు. ‘మీ(చంద్రబాబు) బావ మరిది బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని గతంలో వైద్యులు రిపోర్టు ఇచ్చిన విషయం వాస్తవం కాదా?' ఆయన ప్రశ్నించారు.
అంతేగాక ‘మీ తమ్ముడు నారా రామ్మూర్తి మతి స్థిమితం లేక ఆస్పత్రి ఉన్న విషయం కూడా వాస్తవం కాదా' అని అంబటి రాంబాబు అన్నారు. వైయస్, చంద్రబాబు.. ఇద్దరికీ వైద్య పరీక్షలు చేయిద్దామని, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడని డాక్టర్లు ధృవీకరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
అలాగే వైయస్ జగన్ ఆరోగ్యవంతుడు కారని తేలినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు దమ్ముంటే ఈ సవాలు స్వీకరించాలని ఆయన అన్నారు. టిడిపి నేతలు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘరావు తమను జపాన్ తీసుకెళ్లలేదని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం వైఫల్యాలను ఎందుకంత కంగారని అన్నారు. తెలుగుదేశం నేతలు ఇతరులను విమర్శించడం కాదని.. ఆత్మ విమర్శ చేసుకోవాలని అంబటి రాంబాబు హితవు పలికారు.