‘శిల్పాను అవహేళన చేశారు! చంద్రబాబుకు అదే భయం’
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.
కర్నూలు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో చంద్రబాబు నంద్యాల ముఖం కూడా చూడలేదని దుయ్యబట్టారు. నంద్యాల అభివృద్ధిని కోరుకునేది శిల్పా మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. రోడ్లు వెడల్పు చేయమని గతంలో శిల్పామోహన్ రెడ్డి కోరితే నిధులు ఎక్కడున్నాయని చంద్రబాబు అవహేళన చేశారని అన్నారు. అంతేగాక, దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను మీడియా ముందు ప్రదర్శించారు.
ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో ఇన్నేళ్లు రోడ్డు విస్తరణ ఎందుకు పట్టించుకోలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే శిల్పా మోహన్ రెడ్డిపై కుట్రలు చేశారని ఆరోపించారు.
2014లో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్పై ఏ లాయర్ సంతకం చేశారో.. ఇప్పుడు కూడా అదే న్యాయవాది సంతకం చేశారని వెల్లడించారు. గెలవమనే భయంతోనే నామినేషన్ పైనా నానా యాగీ చేశారని అంబటి విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో ఓటు ద్వారా చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.