సీనియర్లని అవమానించిన బాబు, వేలకోట్లతో ఇల్లు ఎలా కట్టారు: అంబటి అనుమానం
చేతికి ఉంగరం, వాచ్ లేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో రూ. వేలకోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం ప్రశ్నించారు.
అమరావతి: చేతికి ఉంగరం, వాచ్ లేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో రూ. వేలకోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం ప్రశ్నించారు.
జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని చెప్పారు. జగన్పై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అసలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని చెప్పారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. తమ పార్టీ నుంచి వచ్చిన వారికి కేబినెట్లో చోటు ఇచ్చి, టిడిపి సీనియర్లను చంద్రబాబు అవమానించారన్నారు.
ఆరోపణలు చేసినంత మాత్రాన నేరగాళ్లు కాదని జగన్ కేసును ఉధ్దేశించి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ తన పైన వచ్చిన ఆరోపణలను కోర్టులో ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.
చంద్రబాబు దొరకని దొంగ అన్నారు. జగన్ ఏ నేరం చేయకపోయినా ఆరోపణలు వచ్చాయన్నారు. ఆరోపణలు వస్తే నేరం చేసినట్టా అని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారన్నారు.
మాల్యాతో పోలుస్తారా.. రేవంత్ను కేబినెట్లోకి తీసుకోవచ్చా?
చంద్రబాబు తమ పార్టీ అధినేత జగన్ను విజయ్ మాల్యాతో పోల్చి రాక్షసానందం పొందుతున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చా అని నిలదీశారు. అలా అయితే రేవంత్ రెడ్డిని కేబినెట్లోకి ఎందుకు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు.