కోర్టు ఎఫెక్ట్: బాబు దుమ్ము దులిపిన అంబటి, జగన్ మాతో చెప్పలేదు కానీ: మేకపాటి
అమరావతి/నెల్లూరు: స్విస్ ఛాలెంజ్ విధానం పైన తాము ఎన్నిసార్లు నిలదీసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని, కోర్టు మొట్టి కాయలు వేసిన తర్వాత వెనక్కి తగ్గిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గురువారం నాడు అన్నారు.
స్విస్ చాలెంజ్ విధానం పైన ప్రభుత్వం మొత్తానికి యూ టర్న్ తీసుకుందన్నారు. ఈ విధానం పైన మాజీ ఐఏఎస్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈఏఎస్ శర్మ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర హితం కోరే మేధావుల సూచనలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కొత్త నోటిఫికేషన్ ఇస్తాం: జగన్ దెబ్బకు 'రాజధాని'పై చంద్రబాబు యూటర్న్!
చంద్రబాబు సర్కారు మంచి చెబుతున్న వారిని ఖాతం చేయడం లేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. స్విస్ విధానం పైన తమ పార్టీతో పాటు పలు పార్టీలు పలుమార్లు మొత్తుకున్నా వెనక్కి తగ్గలేదన్నారు.
ఇప్పుడు కోర్టులు మొట్టికాయలు వేశాక యూ టర్న్ తీసుకుందన్నారు. స్విస్ విధానం పైన కోర్టుకు వెళ్లిన వారి పైన దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో సింగపూర్ కంపెనీలకు, చంద్రబాబు బృందాలకు లబ్ధి చేకూర్చే కుట్ర జరిగిందన్నారు.
లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని చూశారన్నారు. ప్రజలకు ప్రభుత్వం నిజానిజాలు వెల్లడి చేయాలన్నారు. కోర్టులకు కూడా దొరకని విధంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేశారన్నారు. కోర్టు చెప్పినా వెనక్కి తగ్గమని మంత్రులు చెబుతున్నారన్నారు. సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే దుర్బుద్ధి కనిపిస్తోందన్నారు.
ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుందనే నమ్మకం తమకు లేదన్నారు. వైసిపి, టిడిపికి కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. తమకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమం కోసం నిలదీస్తామని చెప్పారు.
అసలేం జరిగిందంటే..: రాజధాని మీద హైకోర్టులో యూ టర్న్పై నారాయణ
రాజీనామాకు సిద్ధం: మేకపాటి
తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశిస్తే ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామాకు సిద్ధమని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని చెప్పారు. హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. రాజీనామా విషయమై పార్టీ అధినేత తమతో చర్చించలేదని, కానీ తాము సిద్ధమని చెప్పారు. ఆయన ఏం చెప్తే అదే అన్నారు.
ఏపీ అభివృద్ధి చెందాలంటే హోదా కీలకమన్నారు. వెంకయ్య నాయుడు నాడు హోదా గురించి చెప్పి, ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. పార్లమెంటులో హోదా కోసం వైసిపి పోరాటం చేస్తుందని చెప్పారు. కాగా, హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామాకు వెనుకాడబోమని ఎంపీ బుట్టా రేణుక బుధవారం కర్నూలులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేకపాటు కూడా సై అన్నారు.