అమితాబ్ భేటీ: సినిమా ఎక్కడికీ వెళ్లదన్న కెసిఆర్
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడానికి హైదరాబాద్ వచ్చిన అమితాబ్ మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా అక్కినేని పురస్కారం అందుకోనున్న అమితాబ్కు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చినందుకు సీఎం కేసీఆర్కు బిగ్ బి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ అద్భుతమైన నగరమని, నగర అభివృద్ధికి తనవంతు కృషి తప్పకుండా చేస్తానని అమితాబ్ అన్నారు. అమితాబ్తో పాటు ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కూడా కెసిఆర్ చెంతకు వచ్చారు. కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
హైదరాబాద్ అద్భుతమైన నగరమని, హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అమితాబ్ చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని అవార్డు కార్యక్రమానికి కెసిఆర్ హాజరయ్యారు. కెసిఆర్ చేతుల మీదుగా అమితాబ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అమితాబ్కు అవార్డు ఇవ్వడం ద్వారా అక్కినేని పురస్కారం గౌరవం పెరిగిందని ఆయన అన్నారు.
చిత్ర పరిశ్రమ ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లదని కెసిఆర్ అన్నారు. పరిశ్రమ గురించి త్వరలో సినీ ప్రముఖులతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్కు ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ను వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు యునెస్కోకు ప్రతిపాదన పంపాలని ఆయన మంత్రిని కోరారు.