పాలకొల్లు నుంచే పవన్ ఎంట్రీ: అన్న పడ్డ చోటే.. తమ్ముడు గెలవాలనుకుంటున్నాడు (ఫోటోలు)
పాలకొల్లు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏలూరులో తన ఓటు నమోదు చేయించుకోవాలని నిర్ణయించుకోవడంతో.. పశ్చిమగోదావరి కేంద్రంగా ఆయన భవిష్యత్తు రాజకీయాలను ప్లాన్ చేసుకుంటారనేది ప్రస్తుతం చర్చల్లో నానుతున్న అంశం.
గతంలో సినీ గ్లామర్ తో పాలిటిక్స్ లో అడుగుపెట్టిన కృష్ణ , కృష్ణంరాజు లాంటి నేతలు ఇదే జిల్లా నుంచి చట్టసభల్లో అడుగుపెట్టడం.. పవన్ కు ఇది సొంత జిల్లా కావడంతో.. పవన్ చట్టసభల ఎంట్రీ కూడా ఇదే జిల్లా నుంచి ఉండబోతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
అదే సమయంలో.. ఏలూరులోనే పవన్ తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు ప్రకటించడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏలూరు నుంచి పోటీ చేస్తారనేవారు లేకపోలేదు. అయితే అభిమానులు, విశ్లేషకులు వేస్తున్న తాజా రాజకీయ లెక్కల ప్రకారం.. పవన్ చట్టసభల ఎంట్రీ పాలకొల్లు నుంచి ఉండబోతుందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం.
కాపుల కంటే వైశ్య, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది
ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎంతటి క్రియాశీలక పాత్రను పోషిస్తున్నాయో అందరికీ తెలిసిందే. అందుకే పవన్ కూడా వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకునే తన వ్యూహాలు రచించుకుంటున్నారని తెలుస్తోంది. ఏలూరులో కాపు సామాజిక వర్గం కంటే వైశ్య, కమ్మ సామాజిక వర్గమే బలంగా ఉండడంతో.. పవన్ తన చట్టసభల ఎంట్రీకి ఏలూరును ఎంచుకోరనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఏలూరులో ఎవరి బలమెంత?
ప్రస్తుతం ఏలూరులో వైశ్య సామాజిక వర్గానికి దాదాపు 20వేల ఓటు బ్యాంకు ఉంది. అలాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా 20వేల పైచిలుకు ఓటు బ్యాంకు ఉంది. బ్రాహ్మణ వర్గ ప్రాబల్యం సైతం భారీగానే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వోద్యోగుల ఓట్లు కూడా క్రియాశీలకమే.
అదే పాలకొల్లులో అయితే..!
ఏలూరు సంగతి అలా ఉంటే, పాలకొల్లులో మాత్రం కాపువర్గానిదే పైచేయి. సంఖ్యాపరంగా ఇక్కడ కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. మొత్తం కాపుల సంఖ్య దాదాపు 35వేల పైచిలుకు ఉండొచ్చని అంచనా. పవన్ కు తన సామాజిక వర్గంలో ఉన్న మద్దతు దృష్ట్యా.. పవన్ పాలకొల్లు నుంచే బరిలోకి దిగుతారనేది ప్రస్తుతం తెరమీదకు వచ్చిన అంశం.
పాలకొల్లునే ఎంచుకోవడానికి మరో కారణం :
పాలకొల్లులో కాపు సామాజిక వర్గంతో పాటు శెట్టి బలిజలు కూడా బలమైన సామాజికంగా వర్గంగా ఉన్నారు. వీరిలో పవన్ మద్దతుదారులు ఎక్కువగా ఉండడంతో.. కాపు ఓటు బ్యాంకుకు తోడు వీరి ఓటు బ్యాంకు కూడా పవన్ కు కలిస్తొందనేది జనసేన అంచనా అయి ఉండవచ్చు.
అన్న పరాభవానికి బదులు తీర్చుకోనున్న పవన్! :
తెరపై ఊగిసలాడుతున్న కారణాలన్నింటిని మినహాయిస్తే.. పవన్ 'పాలకొల్లు' బాట పట్టడానికి మరో బలమైన కారణమేంటంటే.. అన్న ఓడిపోయిన చోట తాను సత్తా చాటి, అప్పటి అన్న పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని, సామాజిక లెక్కలను అంచనా వేయడంలో విఫలమైన అప్పటి ప్రజారాజ్యం సంస్థాగత చర్యలను విశ్లేషించుకుంటూ ప్రస్తుతం జనసేన తన పునాదులను పటిష్టపరిచే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
కసరత్తులు మొదలయ్యాయా!
పాలకొల్లును తన చట్టసభల ఎంట్రీకి కేంద్రంగా మలుచుకోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్టీకి చెందిన పలువురితో అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన మొదలెట్టేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పవన్ ను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు అక్కడి జనసేన కార్యకర్తలు ఇప్పటినుంచే రంగంలోకి దిగారని జిల్లా వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ఎవరెన్ని లెక్కలేసినా.. తేలేది అప్పుడే :
పవన్ జనసేన పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం.. అధికారిక రాజకీయాల్లోకి పవన్ వడివడిగా అడుగులు వేస్తుండడంతో ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎవరికి తోచిన లెక్కల్లో వారు మునిగిపోయారు. పశ్చిమగోదావరిలోనే ఓటు నమోదు చేయించుకోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే ఎవరికి తోచినట్టు వారు పవన్ రాజకీయాలపై ఎన్నేసి లెక్కలేసుకున్నా.. 2019 ఎన్నికలు సమీపిస్తే గానీ పవన్ అసలు వ్యూహాం ఏంటనేది తేలే అవకాశం లేదు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ.