చంద్రబాబు లోకనాయకుడు, జగన్ ఎకనమిక్ థియరీలో లక్ష కోట్లు: ఆనం వివేకా
విజయవాడ: చంద్రబాబు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని, ఆయన ప్రణాళిక పెట్టుబడులు, అభివృద్ధి కోసం ఉంటుందని ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. జగన్ ఎకనమిక్ థియరీలో మాత్రం లక్ష కోట్ల లాభం ఉంటుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే చంద్రబాబు గుర్తుకు వస్తారన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆనం అనుచరులు నేడు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడ ఏ 1 కన్వెన్షన్ సెంటర్లో టిడిపి ఆదివారం మధ్యాహ్నం భారీ బహిరంగసభ నిర్వహించింది. ఆనం సోదరుల అనుచరులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండువేల మంది కార్యకర్తలు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా ఆనం వివేకా మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుందని చెప్పారు. ఏమీ లేని ఏపీని అభివృద్ధి చేసేందుకు బాబు 24 గంటలు కష్టపడుతున్నారన్నారు. మనకు ఇక్కడ అన్నం, కూర, పప్పు, చివరకు... ఆకు కూడా లేకుండా పోయిందన్నారు.
వీటన్నింటని చంద్రబాబు మనకు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన ఓ పాపం, ఓ శాపం అన్నారు. చంద్రబాబు గొప్ప దళపతి అన్నారు. లోకాన్ని చుట్టివచ్చిన లోకనాయకుడు చంద్రబాబేనని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
విభజన వల్ల చాలా నష్టపోయామని, రాష్ట్ర విభజన పాపం రెండు మూడు తరాలదాకా వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో చంద్రబాబు సీఎం కావడం మన అదృష్టమన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించారని, అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఆనం సోదరులు, అనుచరులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. హేతుబద్ధత లేని విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయని... భావితరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నాయకులకు సూచించారు. కష్టాలను సమర్థంగా ఎదుర్కొంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. కష్ట సమయంలోనూ రైతుల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.