టిడిపిలోకి ఆనం సోదరులు, కార్యకర్తలతో భేటీ: శైలజానాథ్ కస్సుబుస్సు
నెల్లూరు/ హైదరాబాద్: ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వారు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకు గాను, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు గురువారం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు శాసనసభా నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు.
తాము త్వరలోనే టిడిపిలో చేరుతామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆనం సోదరులు టిడిపిలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఇక వేగవంతమైంది. కార్యకర్తలతో భేటీ తర్వాత తాము తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరేది ఆనం సోదరులు నిర్ణయం తీసుకుంటారు.
చంద్రబాబు తమతో మాట్లాడారని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రి నారాయణతో తమకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం తాము టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారంలోగా ఆనం సోదరులు టిడిపిలో చేరే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, ఆనం సోదరులు టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో వారిపై కాంగ్రెసు పార్టీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు. తాజాగా ఆనంపై శైలజానాథ్ పరోక్ష విమర్శలు చేశారు. అధికారం కోసం కొందరు నిస్సిగ్గుగా పార్టీలు మారుతున్నారని ఆయన గురువారంనాడు హైదరాబాద్లో అన్నారు.
సిద్ధాంతాల ప్రాతిపదికనే రాజకీయాలు చేయాలని శైలజానాథ్ హితవు పలికారు. ఆనం సోదరులు పార్టీ మారితే ఎందుకు మారుతున్నారో చెప్పాలని శైలజానాథ్ స్పష్టం చేశారు. బాక్సైట్పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పత్రమని ఆయన ఆరోపించారు.