గురుశిష్యులే: బాబుపై మళ్లీ ఆనం ప్రశంసలు, కేసీఆర్పై..
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మరోసారి పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు మంచి పరిపాలన అందించగలరన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పైన ఆర్థిక భారం పడినందున రుణమాఫీ కొంత ఆలస్యం కావొచ్చునని అన్నారు.
కేంద్రం సహకరించినా, సహకరించక పోయినా చంద్రబాబు రుణమాఫీ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉందని చెప్పారు.
చంద్రబాబు, కేసీఆర్లు గురుశిష్యులే కాబట్టి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. తెలంగాణలోని ఆంధ్రా వారిని సవతి బిడ్డలా తెలంగాణ ప్రభుత్వం చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజీనామా చేయనున్న కనుమూరి బాపిరాజు
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి కనుమూరి బాపిరాజు రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. పాలక మండళ్లను రద్దు చేసేందుకు నేడో, రేపో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్స్ జారీ కాకముందే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. త్వరలో ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. కాగా, టీటీడీ చైర్మన్ రేసులో మురళీ మోహన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ పేరు కూడా వినిపిస్తోంది.