'జగన్ కు పిచ్చిపట్టింది కాబట్టే ఇలా.. శవాలను పీక్కుతినే రాబందులా!!'
నెల్లూరు : వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ.. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి. ఓ పక్క రాయలసీమ రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే.. ఓర్వలేని తనంతో జగన్ ధర్నాలు బంద్ లకు పిలుపునిస్తుండడం సిగ్గుచేటు అని విమర్శించారు.
'పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ.. పదే పదే ప్రభుత్వ పనితీరును విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని' మండిపడ్డారు వివేకా. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి సమాధి అయిపోయే స్థితిలో ఉందన్న ఆనం.. అందుకోసం జగన్ అంతిమపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల రూపాయల్లో.. కొంత మొత్తాన్నయినా వానలు పడేందుకు ఖర్చు చేయాలని జగన్ కు హితవు పలికారు.
నారా లోకేషన్ ను విమర్శించడాన్ని తప్పుబడుతూ.. అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ లాంటి వ్యక్తి లోకేష్ ను విమర్శించడమేంటని ప్రశ్నించారు ఆనం. మానవ మృగంలా ప్రవర్తిస్తున్న జగన్.. 'శవాలను సైతం పీక్కుతినే రాబందులా వ్యవహరిస్తున్నాడని' ఆనం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడును పొగడ్తల్లో ముంచెత్తిన ఆనం.. నదిలో కొట్టుకుపోతున్న నావను రక్షించడానికి నావికుడు చేసే ప్రయత్నం తరహాలో చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆయన సాగిస్తోన్న పోరాటానికి ప్రజలంతా మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.