వైయస్ను చెడగొట్టాడు: జగన్పై ఆనం తీవ్ర వ్యాఖ్య, వైసిపి నుంచి టిడిపిలోకి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆనం వివేకానంద రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆనం వివేకా విలేకరులతో మాట్లాడారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిని అని చెప్పుకునే నైతికత హక్కు జగన్కు లేదన్నారు. బంగారం లాంటి వైయస్ను జగన్ చెడగొట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు పజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో ముప్పై అయిదేళ్లు పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిన సత్తా విజన్ కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని చెప్పారు.
చంద్రబాబుకు నైతిక మద్దతు ఇచ్చేందుకే టీడీపీలో చేరామన్నారు. పని చేసే చంద్రబాబుతో చేరాలి కాని దొంగలు, రౌడీలతో కాదని జగన్ను ఉద్దేశించి మండిపడ్డారు. వైసిపి నేతలు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారన్నారు.
కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకం
ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. ఇటీవల ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కాపు కార్పొరేషన్కు కూడా ఛైర్మన్ను నియమించారు. పది రోజుల్లో మరికొన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించనున్నారని తెలుస్తోంది.
ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఇతర నాయకులకు కూడా అవకాశం కల్పించేందుకు టిడిపి కసరత్తు చేస్తోంది. దశల వారీగా నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. ఆయా కార్పొరేషన్లకు క్రమంగా డైరెక్టర్లను కూడా నియమించనున్నారు.
ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమితులైన వారిలో ఎక్కువ మంది పార్టీ కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్నవారే. మాజీ ఎమ్మెల్యేలు మల్లెల లింగారెడ్డి (పౌర సరఫరాలు), రంగనాయకులు (బీసీ కార్పోరేషన్), వర్ల రామయ్య (గృహ నిర్మాణ), పంచుమర్తి అనురాధ (మహిళా ఫైనాన్స్), జూపూడి ప్రభాకర్ (ఎస్సీ), ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ (గిడ్డంగులు), జయరామిరెడ్డి (ఆర్థిక), రామాంజనేయ (కాపు సంక్షేమం, అభివృద్ధి)లను నియమించారు.