బాగా మదించిన పిచ్చికుక్కలా జగన్.. డ్రామాలు టీవీలో వేసుకో రోజా తల్లి..: ఆనం
రాష్ట్ర అభివృద్ధిని అంతంచేయాలని దురాశపరుడైన జగన్ పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు.
విజయవాడ: సెటైరికల్ స్టేట్మెంట్స్తో వార్తల్లోకి ఎక్కే టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాగా మదించిన పిచ్చికుక్కలా జగన్ వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్ర అభివృద్ధిని అంతంచేయాలని దురాశపరుడైన జగన్ పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అమరావతికి రావాలంటేనే భయమేస్తోందన్న జగన్ వ్యాఖ్యలను ఆనం తిప్పికొట్టారు. జగన్ రౌడీయిజాన్ని చూసి ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలే తలుపులు మూసేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా ఆనం విమర్శలు గుప్పించారు. రోజా తల్లి... నోరు లేని తనపై కేసు వేసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రామాలేవైనా వేయాలనుకుంటే టీవీల్లో వేసుకోవాలని, జనం ముందు వద్దని ఆనం సలహా ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామని ఆనం ధీమా వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్న సీఎంకు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపును కానుకగా ఇస్తామని వివేకానందరెడ్డి చెప్పారు.