ఢిల్లీలో వ్యభిచార గృహం: ఆంధ్ర అమ్మాయికి విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని వ్యభిచార గృహం నుంచి ఆంధ్ర అమ్మాయికి విముక్తి లభించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా వ్యభిచార గృహంలో నరకం అనుభవిస్తున్న ఆమెను ఢిల్లీ పోలీసులు రక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన 26 ఏళ్ల వివాహితతో పక్కింట్లో మహిళకు స్నేహం కుదిరింది. ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమె నమ్మబలికింది. మాయమాటలను నమ్మిన వివాహిత ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైంది. ఓ వ్యక్తినిచ్చి ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి పంపింది.
అక్కడ రెడ్ లైట్ ఏరియాలో వివాహితను అమ్మేశారు. అయితే, వ్యభిచార గృహాల సమాచారం అందుకున్న కమలా మార్కెట్ పోలీసులు వాటిపై దాడి చేశారు. ఆమెతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరికొంత మంది యువతులను కూడా రక్షించినట్లు తెలిసింది. పోలీసులు ఆమెను స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అనూరాధను ఒక దళారీ ఢిల్లీకి తీసుకొచ్చి వ్యభిచార కూపంలో దించినట్లు పోలీసులు జరిపిన విచారణలో తెలిసింది. బాధితురాలు అందించిన వివరాల మేరకు నిందితుడితోపాటు వ్యభిచార గృహం నిర్వాహకురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.