షాక్: గన్ మెన్లను సరెండర్ చేసిన 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదు వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది.
కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదు వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, రైటర్ను దుర్భాషలాడిన వ్యవహారంలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసుల చర్య జిల్లా అధికార పార్టీ నేతల అహాన్ని దెబ్బతీసింది. ఎమ్మెల్యే రాధాకృష్ణను ఏ-1 నిందితునిగా గుర్తిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన వైనం ఆ జిల్లా ఎమ్మెల్యేలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
పోలీసుల ప్రవర్తనకు నిరసనగానే...
ఇందుకు నిరసనగా తమ గన్మెన్లను వెనక్కి పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నంత పనీ చేశారు. జిల్లా ఎస్సీ భాస్కర్ భూషణ్ ను టార్గెట్ చేస్తూ.. జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు పోలీసుల వైఖరికి నిరసనగా తమ గన్ మెన్లను తిప్పి పంపించేశారు.
మంత్రులు చెప్పినా ససేమిరా...
ఆదివారం ఏలూరులో జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామ లక్షి అధ్యక్షతన జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో కూడా ఎమ్మెల్యే రాధకృష్ణపై కేసు అంశం చర్చకు వచ్చింది. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు ఇందుకు నిరసనగా తమ తమ గన్ మెన్లను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రతిపాటి పుల్లారావు, మరో మంత్రి పితాని సత్యనారాయణ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని వారించినా ప్రజాప్రతినిధులు మాత్రం వారి మాట వినలేదు.
నన్ను ప్రశ్నించే అధికారం ఆ సంఘానికెక్కడిది?
జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ జిల్లాలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయమంటూ పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపించారు. దళిత మహిళలపై కేసులు నమోదు చేసిన పోలీసులు అర్థరాత్రి సమయంలో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం జోక్యాన్ని కూడా ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఐదేళ్లుగా ఎన్నికలు కూడా జరగని సంఘానికి తనను ప్రశ్నించే అధికారం ఎలా ఉంటుందన్నారు.
ఆయన జిల్లాను బీహార్ లా మార్చాలనుకుంటున్నారు...
నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పశ్చిమగోదావరి జిల్లాను బీహార్ లా మార్చాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎస్పీ నిజాయితీ పరులైన పోలీసుల అధికారులను పక్కన పెడుతూ, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను అందలమెక్కిస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాదం పరిష్కరమయ్యేంత వరకూ తాము తమ గన్ మెన్లను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మాకేం సంబంధంలేదు, చట్టప్రకారమే చేశాం...
జిల్లా ప్రజాప్రతినిధులు తమ గన్ మెన్లను పోలీసు శాఖకు సరెండర్ చేసినా దానిని తాము ఆమోదించమని మరోవైపు జిల్లా ఎస్పీ భరత్ భూషణ్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు గన్ మెన్ల నియామకానికి తమకు సంబంధం లేదని, సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో నిర్ణయం తీసుకునేంత వరకు వారు తాము కేటాయించబడిన ప్రజాప్రతినిధికి రక్షణగానే ఉంటూ విధులు నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదు వ్యవహారంలో పోలీసులు చట్టప్రకారమే చర్య తీసుకున్నట్లు వివరించారు.
అవసరమైతే రాజీనామాకూ వెనకాడను...
తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆకారణంగా పోలీసులే కేసు పెట్టి తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు. తప్పు చేయకుండా తల వంచే సమస్యే లేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా, ఇతర మాఫియాలపై ఎలాంటి చర్యా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కూడా పోలీసుల చర్యే సరైనదని నమ్మితే.. తాను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు.