ఏపీ అసెంబ్లీ: రాజధాని మాస్టర్ ప్లాన్ ఫ్రీ, జగన్ పార్టీకి ప్రశ్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసన సభలో ప్రశ్నోత్తరాలలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.
కౌలు రైతుల పట్ల చంద్రబాబు సర్కారు వివక్ష చూపుతోందని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాలిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు ఆ దిశగా దృష్టి సారించిన పాపానపోలేదన్నారు.
ఇప్పటి నుండైనా కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాల అందజేయాలని డిమాండ్ చేశారు. విశ్వేశ్వర రెడ్డి ఆరోపణలపై స్పందించిన మంత్రి స్పందించారు. రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టనున్నామని ప్రకటించారు.
రానున్న ఐదేళ్లలో ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకనుందని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆయన ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రంలో ఊహించని రీతిలో వృద్ధి నమోదు కానుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.65 వేల కోట్ల మేర ఉండగా, విభజన తర్వాత ఏపీలో ఐటీ ఎగుమతులు రూ.1,700 కోట్లుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు.
మంత్రి యనమల రామకృష్ణుడు రాజధానిపై మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో సింగపూర్కు ఎలాంటి రాయితీలు ఇవ్వబోమని చెప్పారు. రాజధాని ప్రణాళికను సింగపూర్ ఉచితంగా రూపొందిస్తోందన్నారు. ఏపీకి ఎక్కువ విమానాలు రావాలనే ఇంధన పన్ను తగ్గించామన్నారు.
పోలవరం ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు నీళ్లివ్వొద్దని వైసీపీ ఎందుకు అంటోందని ప్రశ్నించారు. భవిష్యత్తులో పోలవరం నిర్మాణం అంతా కేంద్రమే చేపడుతుందన్నారు. పోలవరం పైన ఖర్చు చేసిన 5వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇవ్వనుందని చెప్పారు.