వైయస్ ఫోటో తొలగింపుపై సభలో ఆందోళన: నిరసన, 10 నిమిషాలు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడోరోజు సమావేశలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యపై వైకాపా ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం తొలగింపుపై వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైయస్ చిత్రపటాలున్న ప్లకార్డులు చేతబట్టిన వైసీపీ నేతలు నిరసన చేపట్టారు.
వైయస్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ కోడెల అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ లాంచ్లో వైయస్ చిత్రపటాన్ని తొలగించడంపై సభలో వైయస్ ఫోటోలతో పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. తొలగించిన వైయస్ చిత్రపటాన్ని యథాస్థానంలో వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ నేతలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
మానవతావాది అయిన వైయస్ విధానాలను అవలంభిస్తే కరవు పరిస్థితులు ఉండేవి కావని వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కరవు పరిస్థితులపై రేపు చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. సభా పద్ధతులను పాటించాలని స్పీకర్ కోడెల వైసీపీ సభ్యులను కోరారు. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.