ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
హైదరాబాద్: దూరప్రాంత బస్సుల్లో 'ఇంట్రానెట్ వైఫై' సదుపాయాన్ని కల్పించేందుకు ఏపీయస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. దీని సహాయంతో ప్రయాణికులు బస్సులో అందుబాటులో ఉంచిన సినిమాల్లో ఎవరికి నచ్చింది వారు చూడొచ్చు.
ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'ఇంట్రానెట్ వైపై' సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. తొలుత విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ ప్లస్, గరుడ బస్సుల్లో దీన్ని అమలు చేయనున్నారు.
గంటపాటు ఉచితం... ఆపై రూ. 10:
ప్రయాణికులకు తమ స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ల్లో ఈ వైపై ఇంట్రానెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే డౌన్ లౌడ్ కూడా చేసుకునే వెసులుబాటుని కల్పించారు. గంట వరకు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆపై రూ.10 చెలించి గమ్యం చేరేవరకు వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు సంస్ధ బాధ్యతల చేపట్టిన తర్వాత నష్టాలు తగ్గించి ఆదాయం పెంచేందుకు కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాల ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బస్సులోనే కంప్యూటర్ వైఫై పరికరం ఉంటాయి. కంప్యూటర్లో సుమారు 50 సినిమాలు, దాదాపు 400 వీడియో పాటలను నిక్షిప్తం చేశారు.