సివిల్ పంపకాలు పూర్తి: 'తెలంగాణ'లో ఉండేందుకు తీవ్రంగా శ్రమించాడు, కానీ ఏపీకే ఖరారు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య సివిల్ అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 26వ తేదీన ఇచ్చిన ప్రొవిజినల్ జాబితా అనంతరం అధికారుల అభ్యంతరాలను పరిశీలించిన డీవోపీటీ తుది జాబితాను గురువారం ప్రకటించింది. తెలంగాణకు 133 మంది ఐఏఎస్లు, 95 ఐపీఎస్లు, 58 ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు.
తుది జాబితాలో తెలంగాణకు కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో శాంతకుమారి తప్ప వీ కరుణ, ఎం ప్రశాంతి, ఏ వాణీప్రసాద్లు తుది జాబితాలో ఆంధ్రప్రదేశ్కు దక్కారు. అలాగే ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు. దీంతో తెలంగాణ కోటాలో ఐదుగురు ఐఏఎస్లు పెరిగారు.
ఇక ఏపీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్న 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్కి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో పని చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, పూనం మాలకొండయ్యలను తుది కేటాయింపుల్లో ఏపీకి కేటాయించారు.
క్యాట్ను ఆశ్రయించినప్పటికీ, పలుమార్లు విజ్ఙప్తులు చేసినప్పటికీ సోమేష్ కుమార్ విషయంలో కేంద్రం కరుణించలేదు. దీంతో ఆయన తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కొనసాగేందుకు చివరి నిమిషం వరకూ సోమేష్కుమార్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
సోమేశ్ కుమార్, పూనం మాలకొండయ్య, జయేష్రంజన్, రోనాల్డ్రాస్లను తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా డీవోపీటీ పట్టించుకోలేదు. జయేష్ రంజన్ను మాత్రమే తెలంగాణకు కేటాయించారు. స్వాపింగ్కు అవకాశం రాకపోవడం, తెలంగాణలోనే కొనసాగించాలన్న ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురవ్వడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఏడాదిన్నరగా జీహెచ్ఎంసీ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూపొందిస్తున్న ప్రణాళికల్లో సోమేశ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ల తుది కేటాయింపులు పూర్తైన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ‘ఆయన ఇక్కడ కొనసాగే అవకాశం లేదు. డిప్యుటేషన్పై రావాలన్నా ముందుగా ఆంధ్రలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది' అని ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు.
ఇక తెలంగాణకు 92 మంది ఐపీఎస్లుండగా, తుది జాబితాలో ఆ సంఖ్య 95కు చేరుకుంది. ఏపీకి గత జాబితాలో 119 మంది ఐసీఎస్లుండగా, తాజా జాబితాలో 116కు తగ్గింది. ఐఎఫ్ఎస్ అధికారుల్లో తెలంగాణకు 58 మంది, ఆంధ్రప్రదేశ్కు 69 మందిని కేటాయించారు.