లొసుగులు: కృష్ణా లంక భూముల సేకరణకు సీఆర్డీఏ రంగం సిద్ధం
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రైతులు, ప్రజల వద్ద నుంచి ఇప్పటికే దాదాపు 30వేల ఎకరాల పంట భూములను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు గుంటూరు జిల్లాలోని కృష్ణానదికి ఆనుకొని ఉన్న 2,146 ఎకరాల లంక భూముల సేకరణకు సీఆర్డీఏ రంగం సిద్ధం చేసింది.
వివరాల్లోకి వెళితే, రాజధాని ప్రాంతంలో ఏ మాత్రం ప్రభుత్వ భూమి లభించినా దానిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా భూముల సర్వేలు, రికార్డుల పరిశీలనలు పూర్తికావడంతో గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆయా లంక భూముల కోసం సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ యూనిట్ల అథారిటీలు నేడో రేపో నోటిఫికేషన్లు జారీచేయనున్నట్లు తెలిసింది. ఈ సమాచారం రైతులకు తెలియడంతో గతకొన్ని దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకుని బతుకుతున్న నిరుపేద రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ లంకభూములను ఇప్పటికే ఆయా ప్రాంతంలోని రాజకీయనేతలు, ప్రభుత్వ పెద్దలు కాజేశారని, మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం తమకు అన్యాయం చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుందని వాపోతున్నారు. తమ భూములను తమకే తిరిగి ఇప్పించాలని, భూసేకరణ తప్పనిసరి అయితే న్యాయమైన నష్టసరిహారం అందజేయాలని కోరుతున్నారు.
సింగపూర్ ప్రభుత్వ సంస్థ ఇచ్చిన మాస్టర్ప్లాన్లో కృష్ణానదిలో ఉన్న ద్వీపాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రివర్ ఫ్రంట్ సిటీకి ఐలాండ్ల అభివృద్ధి ఎంతో ప్రధానమని స్పష్టం చేయడంతో నాలుగు నెలల క్రితం సీఎం చంద్రబాబు లంక భూముల సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
రాజధాని గ్రామాలైన రాయపూడి, బోరుపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగపాలెం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక గ్రామాల్లో లంక భూములున్నాయి. వీటిని 1958 నుంచి ప్రభుత్వం పలు సొసైటీలకు అసైన్మెంట్ చేసింది. 1976, 1977లో ఉత్తర్వులను సవరించి నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్మెంట్ కింద ఇచ్చింది.
అంతేకాదు సాగుకు మాత్రమే ఈ భూములను వినియోగించుకోవాలని, ప్రభుత్వం తనకు అవసరమైనపుడు తిరిగి తీసుకొంటుందని నిబంధన పెట్టింది. ఈ క్రమంలో ఈ 30, 40 ఏళ్లలో ఆ భూములు అక్కడున్న బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూములపై కన్నేసిన బడాబాబులు అసైన్మెంటుదారుల నుంచి కొనుగోలు చేసి సుబాబూల్ తోటలు వేశారు.
ఈ విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న బడాబాబుల్లో ఒక్కో వ్యక్తి పేరు మీద 80 ఎకరాల వరకు భూములున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. ఈ వివరాలన్నీ ఇప్పుడు లంక భూములపై దృష్టి పెట్టగా వెలుగులోకి వచ్చాయి.
ఏపీ ప్రభుత్వం లంక భూములను సేకరిస్తుందనే విషయం తెలుసుకున్న బడాబాబులు వీటని వెంటనే అమ్మేశారు. దీంతో ఇప్పుడు ఈ లంకభూములను కొనుగోలు చేసిన వారి పరిస్థికి అగమ్య గోచరంగా మారింది. అసలికే రాజధానిలో భూమి ఉందంటే దాని ధర కోట్లలో పలుకుతున్న సంగతి తెలిసిందే.