సమస్యల వలయం: చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఒత్తిడికి గురువతున్నారనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంపైనా, పార్టీపైనా దృష్టి సారించడం ఆయనకు కత్తి మీద సాములా మారినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు కూడా ఆయనను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఆయన మంత్రులపైనా, అధికారుల పైనా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు, తనయుడు నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఒత్తిడి కూడా పార్టీ నాయకుల నుంచి పెరిగినట్లు సమాచారం.
అనూహ్యంగా చాలా త్వరితగతిన హైదరాబాదును ఖాళీ చేయాల్సి రావడం కూడా ఆయనకు గుదిబండగా మారిందని అంటున్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నేపథ్యంలోనే హైదరాబాదు నుంచి త్వరితగతిన విజయవాడకు తరలి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత కూడా సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలిక్కి రాలేదు.
తాజా సమస్య మెగా ఫుడ్ పార్క్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో తలపెట్టిన మెగా ఫుడ్ పార్కు ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కొంత మంది రైతులు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవకాశంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఆయన ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించారు కూడా.
మెగా ఫుడ్ పార్కుపై పవన్ కల్యాణ్...
మెగా ఫుడ్ పార్కును తనకు మిత్రుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విమర్సించడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. పవన్ కల్యాణ్ విమర్సల తర్వాత రైతులను సానుకూలం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది తెలియడం లేదు. టిడిపి పెట్టనికోటగా భావిస్తున్న గోదావరి జిల్లాల్లో వ్యతిరేకత ఎదురైతే ఏం చేయాలనేది చంద్రబాబుకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
ముద్రగడ సమస్య ఇలా...
కాపు రిజర్వేషన్ల విషయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజేసిన సెగ చల్లారేట్లు కనిపించడం లేదు. ఆయన పాదయాత్రను తలపెట్టారు. ఎప్పటికప్పుడు ముద్రగడ పద్మనాభానికి కౌంటర్ ఇవ్వాల్సిన స్థితిలో చంద్రబాబు పడ్డారు. ఇది పెద్ద తలనొప్పిగానే మారింది. మంజునాథ్ కమిషన్ అభిప్రాయ సేకరణ జరుపుతోంది గానీ బీసీలను బుజ్జగించడం ఎలాగో తెలియడం లేదు.
ప్రత్యేక హోదా చల్లారుతుందా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగానే తేల్చేసింది. అందుకు చంద్రబాబు కూడా దాదాపుగా సమ్మతించినట్లే. అయితే, దీనిపై వైయస్ జగన్ పోరాటం ఆపేస్తారా, ప్రత్యేక హోదా అవసరం లేకుండా ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చంద్రబాబు నమ్మించగలరా అనేవి ప్రశ్నలే. వచ్చే ఎన్నికలనాటికి ఇది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి.
నారా లోకేష్ ఆదుకుంటారా....
తనయుడు నారా లోకేష్ చంద్రబాబు అంచనాల మేరకు పనిచేయగలరా అనేది ఇంకా రుజువు కావాల్సే ఉంది. హైదరాబాదును వదిలేసి గుంటూరులోనే ఉండి పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు తనయుడ్ని ఆదేశించారు. దీంతో నారా లోకేష్ అందుకు దాదాపుగా ఏర్పాట్లు చేసుకున్నారు.
మంత్రివర్గ విస్తరణ కూడా సమస్యనే...
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కూడా చంద్రబాబుకు సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఎవరికి స్థానం కల్పిస్తారనే విషయాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మందికి ఆయన మంత్రి పదవులు లేదా ఇతర పదవులు ఇవ్వగలరనేది చెప్పడం కష్టమే. ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ జరిగి, పదవులు పంపకం జరిగితే పార్టీలో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చెప్పడం కష్టమే.
చంద్రబాబు తెలంగాణను వదిలేసినట్లే...
చంద్రబాబు తెలంగాణను వదిలేసినట్లేనని చెప్పక తప్పదు. నారా లోకేష్ కూడా తెలంగాణ నాయకులకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణ నాయకులు తమ దారి తాము చూసుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి తానే తెలుగుదేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారంతా కలిసి పనిచేస్తారా అనేది అనుమానమే.
అమరావతి కొలిక్కి వస్తుందా..
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం వచ్చే ఎన్నికల నాటికి ఏ మేరకు పూర్తవుతుందనేది చెప్పలేని స్థితి. చాలా కాలం వెలగపూడిలోని తాత్కాలిక రాజధాని నుంచి పరిపాలన చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉండవచ్చు.