కాశ్మీర్ హిమపాతంలో ఎపి జవాను మృతి?
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక హిమపాతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జవాను బలైనట్లు తెలుస్తోంది. సియాచిన శిఖరం హిమపాతం వల్ల మరణించినవారి పేర్లను సైన్యం శుక్రవారంనాడు విడుదల చేసింది. లడక్ తూర్పు ప్రాంతంలో హిమపాతం దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే.
హిమపాతంలో మరణించినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పర్నేపల్లికి చెందిన సిపాయి ముస్తాక్ అహ్మద్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందినవారు నలుగురు ఉన్నారు.
జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో పాటు కర్ణాటకకు చెందిన ముగ్గురు కూడా మరణించినవారిలో ఉన్నారు. కేరళ, మహారాష్ట్రలకు చెందినవారు ఒక్కరేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సిపాయి కుటుంబానికి అతని మరణం గురించి ఇంకా తెలియలేదు.
ముస్తాక్కు నలుగురు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. వారందరిలోకి అతనే పెద్దవాడు. అతని తల్లిదండ్రులు రైతులు. అయితే, ఆ సంఘటన గురించి తమకు ఇంకా స్పష్టమైన సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. కుటుంబానికి తగిన సాయం అందిస్తామని చెబుతున్నారు.