ఏపీఅంతా వైఫై:బాబు సరేనంటే నిలదీస్తామని ఎంపీలు
న్యూఢిల్లీ: దేశంలోనే రాష్ట్రవ్యాప్తంగా వైఫై నెట్వర్కు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడనుంది! దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. 3జీ, 4జీ ప్లాట్ఫారం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికీ 15 ఎంబిపిఎస్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ప్రతి వాణిజ్య సంస్థకూ వంద ఎంబిపిఎస్ నుండి ఒక జిబిపిఎస్ వరకూ కనెక్షన్లను ఇస్తారు.
దేశంలో మూడు రాష్ట్రాలు ఈ పూర్తిస్థాయి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థకు ఎంపికయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 6వేల కోట్లతో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లో 1.20 కోట్ల ఇళ్లకు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు దీనివల్ల దక్కుతాయి. 150 రూపాయిలకే టివి, ఇంటర్నెట్ వినియోగించుకునే సదుపాయం కలుగుతుంది.
నిరంతరాయ బ్రాడ్ బ్యాండ్ సదుపాయం వస్తుంది. దేశంలో ఓఎఫిసి రాష్ట్రంగా ఆంధ్రా ఏర్పాటుకు కేంద్రం శనివారం నాడు ఆమోదముద్ర వేసింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉన్న తొలి జిల్లా గా విశాఖ ఆ గుర్తింపు పొందనుంది. కేంద్రం తన వాటాగా 1940కోట్లు కేటాయిస్తుంది. ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు ఐదేళ్లలో 4913 కోట్ల వ్యయం చేస్తారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల నుండి పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.
టెలికం కమిషన్ ముందుకు గత నెలలో ఈ అంశం ప్రతిపాదించింది. వెంటనే మౌఖిక అనుమతి దక్కింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో పాటు రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాలకు సైతం దీనిని అమలుచేసేందుకు ముందుకు వచ్చింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను వినియోగించే మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఆ రాష్ట్రం స్వయంగా ఎన్ఓఎఫ్ఎన్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ రాష్ట్రం స్వయంగా ముందుకు వచ్చిందని జైట్లీ ప్రకటించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని టెలికం శాఖ వారికి అందజేస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామాల్లో 7.5 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
బడ్జెట్ పైన ఏపీ టీడీపీ ఎంపీల ఆగ్రహం
బడ్జెట్లో ఏపీకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదని టీడీపీ లోక్సభాపక్ష నాయకుడు తోట నరసింహం వాపోయారు. ఆంధ్రప్రదేశ్ను విభజించింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి కేంద్రమే నవ్యాంధ్రను ఆదుకోవాల్సి ఉందని, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రాల ఆర్థికస్థితి పెరుగుతుంది కాబట్టి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని జైట్లీ చెప్పారని, కానీ ఐదేళ్ల తర్వాత కూడా ఏపీ లోటు బడ్జెట్తోనే ఉంటుందని కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
భారతదేశం మొత్తానికీ ఈ బడ్జెట్ బాగున్నప్పటికీ తనను మాత్రం ఈ బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని ఎంపీ శివప్రసాద్ అన్నారు. రాష్ట్రాన్ని విభజించి ఏడాది గడుస్తున్నా పారిశ్రామిక అభివృద్ధి, పన్ను రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణ నిధులు, ప్రత్యేక హోదాపై ఇంకా స్పష్టత రాకపోవటం మంచి పరిణామం కాదని గల్లా జయదేవ్ అన్నారు. చంద్రబాబు సరే అంటే బీజేపీని నిలదీస్తామన్నారు.