అమరావతి వేడుకపై భారీ ప్రణాళిక: ఆరు గ్యాలరీలు, రైతులకు ప్రత్యేక స్థలం
అమరావతి: అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే అతిథులు, అనధికారులు, ప్రజలకు వేర్వేరుగా ఆరు గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వీవీఐపీలకు - రెండు, ఎంఐపీలకు - 1, వీఐపీ - 1, రైతులు - 1, రాజధాని నగరం ఏర్పాటు కానున్న 29 గ్రామాల ప్రజలందరికీ కలిపి ఒకటి ఉంటాయి.
సభా ప్రాంగణంలోకి వచ్చిన వారికి సీటింగ్ సౌకర్యం కల్పించటానికి పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. సభాస్థలిలో మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో ఒకటి ప్రధాన వేదిక. దీనిపై కనీసం 50 మందికి తగ్గకుండా ఆసీనులయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
రెండోది సాంస్రృతిక కార్యక్రమాలకు, మూడోది శంకుస్థాపన జరిగే చోట ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొద్దిసేపు కూర్చోడానికి వీలుగా ఉంటాయి. ప్రధాన వేదికకు ఏ వైపున కూర్చున్నా వేదిక పైన ఉన్న ముఖ్యులు కనిపించేలా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి గ్యాలరీలో 500 నుంచి వెయ్యి మంది కూర్చునేలా అనుబంధ గ్యాలరీలు మరో ఐదారు ఏర్పాటు చేస్తారు. గ్యాలరీల్లోకి వెళ్లేందుకు పాస్ ఉండాలి. 50 వేల కుర్చీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు సాధారణ పరిపాలన శాఖ 50 వేల పాస్లు ముద్రిస్తోంది.
సామాన్య ప్రజల కోసం గ్యాలరీలు నిర్మిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు వేదిక ప్రాంగణంలో అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. వారిని వేదిక ఎదురుగా ఒకవైపు కూర్చునేలా గ్యాలరీలు నిర్మించాలని నిర్ణయించారు. ఆ గ్రామాల ప్రజలంతా ఒకేచోట ఉంటారు.
ఈ గ్రామాల ప్రజలకు 25 వేల పాస్లు ఇచ్చే అవకాశముంది. ఆయా గ్రామాల్లో భూములిచ్చిన రైతుల కోసం మరో ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులను సన్మానిస్తారు. అతిముఖ్యులు పేరిట ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు.
దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న ముఖ్యులు అందరికీ ఈ గ్యాలరీలోకి తీసుకొస్తారు. వీరిలో బహుళజాతి కంపెనీల దిగ్గజాలు, ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు ఉంటారు.
మరోవైపు, కేంద్ర, రాష్ట్రాల అమాత్యులు, కేబినెట్ హోదా కలిగిన ఆయా సంస్థల ఛైర్మన్లు, పార్లమెంటుసభ్యులు, ఆయా రాజకీయ పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు, విపక్ష నేతలు, విద్యారంగ ప్రముఖులు, సంఘసేవకులు తదితరులను వీవీఐపీల గ్యాలరీల్లో కూర్చోబెడతారు.
ఎమ్మెల్యేలు మొదలుకుని జడ్పీటీసీ సభ్యుల దాకా వీఐపీల గ్యాలరీలో కూర్చుంటారు. ఇలా మొత్తం ప్రధానంగా ఆరు గ్యాలరీలు చేపట్టి వాటిల్లో ఐదారు చొప్పున మొత్తం 25 అంతర్గత గ్యాలరీలు నిర్మించి మొత్తం 50 వేల దాకా సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు.