అమరావతి శంకుస్థాపన: 30 ఎకరాలిస్తే ఇదేనా ప్రభుత్వ మర్యాదా?
గుంటూరు: చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 22న జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు పట్టువస్త్రాలు అందజేస్తామని, చీర, సారెపెట్టి ఆహ్వానిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
అంతేకాదు రాజధాని అమరావతి మన నీరు-మన మట్టిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామాల నుంచి ఒక లీటరు నీరు, ఒక కేజీ మట్టిని రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంతానికి తరలించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు సంకల్ప జ్యోతి యాత్రను కూడా చేపట్టింది.
అయితే ఈ కార్యక్రమం పండుగ వేడుకలా సాగాలని ప్రకటించిన ప్రభుత్వం ఆదిలోనే వారిని విస్మరించింది. రాజధాని శంకుస్థాపన కోసం ఎంపిక చేసిన స్థలం వివరాలను ఆ పొలం ఇచ్చిన రైతుకు కనీసం తెలియజేయలేదంట. పత్రికల్లో వచ్చిన తర్వాతనే తన పొలంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని తెలుసుకున్న రైతు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు జూజాల చెన్నకేశవరావు, చలపతిరావులు 30 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ రైతులిచ్చిన భూమిలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తమకు సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపన చేస్తారా? అని భూమినిచ్చిన రైతులు ఆవేదన చెందారు. 30 ఎకరాల భూమి ఇచ్చిన తమకు ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.