జాడలేని సిరంజి సైకో: జనాల్లో ఆందోళన, సైలెంట్ అయ్యాడా?
హైదరాబాద్: ముఖానికి నల్లని ముసుగు వేసుకున్న ఓ ఆగంతకుడు సూది పోట్లతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనం మీద కనుకు లేకుండా చేశాడు. ఒంటరిగా కనిపించిన మహిళలే టార్గెట్గా ఇంజెక్షన్లు చేసి, పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినా అతడిని పట్టుకోవడంలో విఫలమయ్యారు.
తాజాగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న సిరంజి సైకో కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఒంటరిగా కనిపించే ఆడ పిల్లలు, మహిళలపై సూది దాడి చేసి పరారవుతున్న సైకో దాడులతో పశ్చిమగోదావరి జిల్లా సహా పరిసర జిల్లాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సైకోను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఊహాచిత్రాన్ని విడుదల చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైకోను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
పోలీసులు కూడా పట్టువదలి విక్రమార్కుల్లాగా భీమవరం, తణుకు, పాలకొల్లుల్లో పోలీసులు ప్రతి ఇంటికి తిరుగుతూ సైకో కోసం జల్లెడ పడుతున్నారు. సిరంజి సైకో జాడ తెలిపిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల బహుమతిని నజరాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత నెల 26వ తేదీ నుంచి జరుగుతున్న సూదిదాడులన్నీ ఊహాజనితమేనని తాజాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భీమవరం పరిసరాల్లో జరిగినట్టుగా చెబుతున్న దాడులు ఈ పరిధిలోకే వస్తాయని పోలీసులు వెల్లడించారు. మరోవైపు జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ మాత్రం 26వ తేదీ నుంచి ఇప్పటి దాకా ఎలాంటి దాడులు జరగలేదని సోమవారం భీమవరంలో ప్రకటించారు.
కొందరు భయపడడం కారణంగానే సూది దాడులు జరిగాయన్న ప్రచారం జరుగుతుందని తేల్చి చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న దాడుల మాట ఏమిటనేదే మరో ప్రశ్న. సాధారణంగా భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇలాంటి భయం ముసుగులోనే ఉంటారు.
తాజాగా శివదేవుని చిక్కాలలోను పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు పెన్నాడలో కూడా ఒకరిని అదుపులోకి తీసుకున్నప్పుడు ఇంకేముంది సైకో దొరికినట్టుగా ప్రచారం జరిగింది. తీరా విచారిస్తే అతను పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థిగా నిర్ధారణ అయ్యింది.