ఆంధ్రజ్యోతికి కారుచౌకగా భూములు: బాబుపై ఒత్తిడా?, జగన్ పత్రిక ఇలా!..
ఇది కాక అప్పట్లో ఎకరా స్థలాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు గాను.. దానికి ప్రత్యామ్నాయంగా రూ.50లక్షల చొప్పున ఎకరా భూమిని కేటాయించాలని తాజా ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ పేర్కొంది.
విశాఖపట్నం: పత్రికా యుద్దాలే పతాక శీర్షికల్లోకి ఎక్కి కొట్టుకోవడం తెలుగు జర్నలిజంలో సుమారుగా అందరికీ సుపరిచితమే. వ్యక్తులు కదా.. జుట్టు జుట్టు పట్టుకున్నట్లు.. తెలుగులో కొన్ని దినపత్రికలు ప్రత్యర్థుల వలే తగువులాడుకున్న తీరు అంత సులువుగా మరిచిపోయేది కాదు.
ఈ సంగతంతా పక్కనపెడితే.. ఒక పత్రిక అంతర్గత వ్యవహారాలపై మరో పత్రిక ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతుంది. ఎక్కడా తేడా కొట్టే వ్యవహారం దొరికినా.. దాన్ని జనం ముందు చర్చకు పెడుతుంది. తాజాగా ఆంధ్రజ్యోతిపై ఏపీ సర్కార్ చూపిస్తున్న ఉదాత్తమైన ప్రేమను సాక్షి దినపత్రిక బయటపెట్టింది. కోట్ల విలువ చూసే భూములను కారుచౌకగా కట్టబెట్టేశారనేది ఆ కథనం ద్వారా స్పష్టమైంది.
ఇంతకీ ఏంటా వ్యవహారమంటే!.. విశాఖలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోదా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం చేసిన భూకేటాయింపులు. ఎప్పుడో 1986నాటి లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూడా కేవలం రూ.10వేలకు 50సెంట్ల భూమిని ఆమోదా పబ్లికేషన్స్కు ప్రభుత్వం కట్టబెట్టింది.
1986లో ఆంధ్రజ్యోతికి కేటాయింపులు:
ఆమోదా పబ్లికేషన్స్ కోసం 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ శివారులోని పరదేశిపాలెం గ్రామ పరిధిలో సర్వే నం.191, 169లలో ఎకరా రూ.10వేలకే 1.50ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో రోడ్డు విస్తరణ పనుల రీత్యా.. ఇందులోంచి ఎకరా భూమిని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50సెంట్ల భూమి ఆంధ్రజ్యోతి యాజమాన్యం చేతిలోనే ఉంది.
అప్పటి రేటు ప్రకారం భూమి కావాలని:
జాతీయ రహదారి విస్తరణ కోసం ఆంధ్రజ్యోతి నుంచి తీసుకన్న 1ఎకరా భూమికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. అలాగే మిగిలిన 50సెంట్ల భూమికి ఆంధ్రజ్యోతి నుంచి రావాల్సిన రుసుంను కూడా వసూలు చేయలేదు. ఈ నేపథ్యంలో తమ వద్ద నుంచి తీసుకున్న భూమికి బదులు.. అప్పటి రేటు ప్రకారమే ఇప్పుడు తమకు ఎకరా భూమి ఇవ్వాలని ఆమోదా పబ్లికేషన్స్ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంది.
ఓకె చెప్పిన సీఎం:
ఆంధ్రజ్యోతి ఒత్తిళ్లతో ప్రభుత్వం కూడా అప్పటి రేటు ప్రకారం.. అంటే ఎకరా రూ.10వేలు చొప్పున భూకేటాయింపులు జరిగేందుకు ముందుకు వచ్చింది. అదే పరదేశిపాలెం ప్రాంతంలో 50సెంట్ల భూమిని గుర్తించాలని సీఎం చంద్రబాబు విశాఖ కలెక్టర్ ను ఆదేశించారు. గత కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని, మార్కెట్ విలువ ఎకరా రూ.7.26కోట్లుగా ఉందని నిర్దారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇదే రేటును మరోసారి ధ్రువీకరిస్తూ ప్రస్తుత జిల్లా కలెక్టర్ సైతం గతేడాది ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
రూ.10వేలకే:
మొత్తం మీద ప్రభుత్వ ఆదేశాలతో పరదేశీపాలెంలోని సర్వే నంబర్ 191/10, 191/14లోని 50సెంబ్ల భూమిని ఎకరా రూ.10వేల చొప్పున ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కేటాయించింది. ఈ లెక్కన 50సెంట్ల భూమికి కేవలం రూ.5వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వళవన్ బుధవారం జీవో ఎంఎస్.25ను జారీ చేశారు.
ఇది కాక అప్పట్లో ఎకరా స్థలాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు గాను.. దానికి ప్రత్యామ్నాయంగా రూ.50లక్షల చొప్పున ఎకరా భూమిని కేటాయించాలని తాజా ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఎకరా రూ.10కోట్లు పలుకుతున్న చోట.. ప్రభుత్వం కేవలం రూ.50లక్షలకే కేటాయించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్లలో భూమిని ఉపయోగించుకోవాలని, ఆ భూమిలో వాటర్ బాడీస్(చెరువులు, గడ్డలు) రూపు మార్చకూడదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది మార్చి 31వ తేదీకల్లా భూమి వినియోగంపై కలెక్టర్ కు నివేదిక సమర్పించాలని కోరింది.