కాపులకు రిజర్వేషన్ వద్దు: ఇంట్లో తనను తాను బంధించుకున్న రామచంద్రయ్య
తిరుపతి: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో కొత్త తలనొప్పి మొదలవనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించొద్దంటూ తిరుపతిలో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.
అన్నా రామచంద్రయ్య అనే బీసీ సంఘం నేత గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంట్లో తనను తాను బంధించుకుని నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నా రామచంద్రయ్య నిరాహార దీక్షకు మద్దతుగా కొంతమంది బీసీ సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.
మరోవైపు పోలీసులు రామచంద్రయ్య దీక్షను భగ్నం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రామచంద్రయ్య దీక్షకు మద్దతుగా ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువకుడికి నచ్చజెప్పి కిందుకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కాపులను బీసీల్లో చేర్చే అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని బీసీ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. ఎక్కడో తూర్పుగోదావరిలో తన ఇంట్లో కూర్చొని ముద్రగడ పద్మనాభం చేసిన దీక్షకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో ఎలా చేర్చుతారో చంద్రబాబు వెల్లడించాలన్నారు.
రాష్ట్రంలో బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు బీసీ సంఘాల నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తప్పుబట్టారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై రాష్ట్రంలోని 36 సంఘాల చంద్రబాబు మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో 70 శాతం ఉన్న బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.
బీసీలను నిర్లక్ష్యం చేస్తే, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. బీసీల కోసం అన్నా రామచంద్రయ్య చేస్తున్న ఈ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామన్నారు. బీసీల కోసం రామచంద్రయ్య చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రామచంద్రయ్యకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బీసీలకు అన్యాయం జరగక్కుండా కాపులకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనేది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బీసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.
మా అన్నం వేరొకరికి పెట్టొద్దని, మా అన్నం మమ్మల్ని తిననీయాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అన్నా రామచంద్రయ్య దీక్షను భగ్నం చేయాలని చూస్తే, మా ఆందోళన కార్యక్రమాలను విస్తృతం చేస్తామని సీఎం చంద్రబాబును హెచ్చరించారు.
బీసీల సంఘాల నేతలతో కనీసం చర్చలు కూడా జరపకుండా కాపులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం దారుణమన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే ఎన్ని త్యాగాలకైనా బీసీలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.