టిడిపిలోకి మరో ఎమ్మెల్యే, తగ్గుతున్న జగన్ బలం: బాబు 'అలా' దెబ్బతీసేనా?
విజయవాడ: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జూన్ 1న టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి 67 అసెంబ్లీ స్థానాలలో గెలిచింది. కొద్ది నెలల క్రితం రాజ్ భవన్ ఎదుట మాట్లాడుతూ.. తాను తలుచుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తానని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయనకు రివర్స్ అయింది. వరుసగా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారు.
ఇప్పటికే పదిహేడు మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. దీంతో వైసిపి బలం 50కి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ బలం యాభై కంటే తక్కువ కానుంది. మరో ఎమ్మెల్యే కూడా టిడిపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు పిలుపు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోటీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం రాజ్యసభకు జరగనున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు స్థానాలున్నాయి. వీటిలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు స్థానాలు దక్కనున్నాయి. ఇక విపక్ష వైసీపీకి ఓ సీటు దక్కనుంది.
అయితే ఆ పార్టీకి దక్కనున్న ఆ ఒక్క సీటుకు కూడా గండి కొట్టేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగో స్థానానికి కూడా అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇప్పటికే పార్టీ నేతల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో వాటి దిశగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు.
నేటి సాయంత్రంలోగా దీనిపై ఆయన ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ టికెట్ పైన విజయం సాధించి ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నుంచి ఓ సందేశం వెళ్లింది. సోమవారం సాయంత్రం లోగా విజయవాడకు రావాలని అందులో ఉంది.
వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు. వీరితో ప్రత్యేకంగా భేటీ కానున్న చంద్రబాబు రాజ్యసభ బరిలో నాలుగో అభ్యర్థిని దింపాలా? వద్దా? అన్న అంశంపై సమాలోచనలు జరపనున్నారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. ఇటీవలే విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన తాను రాజ్యసభ బరిలో నాలుగో స్థానానికి పోటీ చేస్తానని ప్రతిపాదించారు.
వైసీపీలో తనకున్న పరిచయాలతో సులభంగానే విజయం సాధిస్తానని చంద్రబాబుకు చెప్పారు. అయితే దీనిపై అప్పటికప్పుడే చంద్రబాబు హామీ ఇవ్వలేదు. నిన్న మహానాడు ముగిసిన అనంతరం వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వాదనను పరిశీలించిన తర్వాత వేమిరెడ్డి ప్రతిపాదనకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.