ఎర్రచందనం స్మగ్లర్లపై ఎపి కొరడా: చెన్నైలో దాడులు, శరవణన్ అరెస్టు?
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించినట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో 20 మందిని పోలీసులు హతమార్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద చేపలపై గురి పెట్టినట్లు తెలుస్తోంది.
సోమవారంనాడు చిత్తూరు జిల్లా పోలీసులు తమిళనాడు రాజధాని చెన్నైలోని గోదాములపై దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ శరవణన్ను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వ్తున్నాయి. చెన్నైలోని రాణినగర్, మధురవాణి, సిట్కాట్ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా పోలీసులు దాడులు నిర్వహించి 130 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు గోదాములపై దాడులు నిర్వహించి 11 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
కాగా, ఎపి పోలీసులు పశ్చిమ బెంగాల్లో సౌందర రాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ప్రాంతంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో టాస్క్ ఫోర్స్ పదకొండు టన్నుల ఎర్ర చందనంను సీజ్ చేశారు.
అందిన సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ సీజ్ చేసిన ఎర్రచందనం విలువ పది కోట్ల నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ సోదాల్లో పోలీసులు సౌందర రాజన్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
సౌందర రాజన్ మయన్మార్ జాతీయుడని సమాచారం. ఇతను తన ఎర్ర చందనం గోడౌన్ను సిలిగిరిలో ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. ఎర్రచందనం దొంగలు ఎర్ర చందనం కర్రలను చైనాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్, బర్మా మీదుగా వారు చైనాకు తరలిస్తున్నారు.
చైనాలో ఎర్ర చందనంకు చాలా డిమాండ్ ఉంది. చైనాలో ఒక టన్ను ఎర్ర చందనం రూ.10 కోట్ల వరకు పలుకుతుంది. అదే భారత్లో దాని విలువ రూ.15 లక్షల నుండి 20 లక్షల వరకు పలుకుతుంది.