జగన్కు మరో షాక్: 'కడప' ఆదినారాయణ పక్కచూపు!
కడప/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్! సొంత జిల్లా కడపలో ఈసారి అధినేతకు నేతలు ఝలక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం నాడు పార్టీ విస్తృస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు గైర్హాజరయ్యారు. వీరి గైర్హాజరీ పార్టీలో చర్చనీయాంశమైంది. వారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు సీనియర్లు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో జగన్ సొంత జిల్లాకే చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు ఉండటం గమనార్హం.
ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ టీడీపీ నేతలు
తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీటీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీటీడీపీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వ్యవసాయమంత్రి రాధామోహన్సింగత్ను నేతలు కలువనున్నారు.
విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ను సైతం నేతలు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సీసీఐ చైర్మన్తో టీటీడీపీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే విభజన చట్టం అమలు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై వినతిపత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. ఏపీ సచివాలయంలో తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. రాజధాని భూసమీకరణ, తుపాను, అంతర్రాష్ట్ర పన్నులు, ఇంటర్ బోర్డు, జలవివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.