గోశాలలో 21 గోవుల మృతి: సాంబశివ రావు అరెస్టు
విజయవాడ: దుర్గగుడి దగ్గర గోశాలలో గోవుల మృతి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా సోమవారం మరో రెండు గోవులు మృతి చెందాయి. దీంతో గోశాలలో ఇప్పటి వరకు గోవుల మృతి సంఖ్య 21కి చేరింది. గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి దేవినేని ఉమా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు గోవులకు దాణా పంపిణీ చేసిన భవానీ ఇండస్ట్రీస్ అధినేత సాంబశివరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దానికి తోడు, గోసంరక్షణ కేంద్రానికి చెందిన 39 మంది నిర్వాహకులతో పాటు మేనేజర్పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులు మృతి చెందడం పట్ల విజయవాడ ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివిధ పార్టీల నేతలు గోసంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపడుతున్నారు. సోమవారంనాడు సీపీఐ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం ధర్నా నిర్వహించారు.