ఏడాది ముందుగా ఎన్నికలంటే ఏ రాష్ట్రమైనా ఒప్పుకుంటుందా? : మంత్రి లోకేష్
ఏదో ఆర్నెల్లు ముందంటే ఒప్పుకోవచ్చుగానీ మరీ ఏడాది ముందు ఎన్నికలంటే ఎవరు ఒప్పుకుంటారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 2018 ద్వితీయార్థంలో ఏ రాష్ట్రనికీ ఎన్నికలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: ఏడాది ముందుగా ఎన్నికలంటే ఏ రాష్ట్రమైనా ఎందుకు ఒప్పుకుంటుందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఏదో ఆర్నెల్లు ముందంటే ఒప్పుకోవచ్చుగానీ మరీ ఏడాది ముందు ఎన్నికలంటే ఎవరు ఒప్పుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా అమరావతిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే తన తండ్రి చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
2018 ద్వితీయార్థంలో ఏ రాష్ట్రనికీ ఎన్నికలు ఉండబోవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాట్లు చెప్పారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ గెలుపు ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు. గెలవలేమేమో అన్న భయం తమకు ఎప్పుడూ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈసారీ వారు టీడీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.