భూమా నోటీస్ తిరస్కరణ: ఆందోళనకు దిగిన వైసిపి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వైయస్సార్ శాసనసభ్యుల నిరసనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడింది. సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాద రావు తిరస్కరించారు. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుపై చర్చించాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జీరో అవర్ను అడ్డుకుని నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. నోటీసులు అంశం తమ పరిశీనలో ఉందని స్పీకర్ పదేపదే చెప్పినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
నియమాల ప్రకారం, సభ్యుల మద్దతు ఉన్నందున నోటీసును అంగీకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై రౌడీషీ తెరిచారని, ఇవాళ తనకు జరిగింది రేపు మరొకరికి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు.
అలాగే నగరి వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ - కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులపైనా ఇలాంటి కేసులే పెడుతున్నారని అన్నారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ బాధ వినాలని భూమ నాగిరెడ్డి పదేపదే స్పీకర్ను కోరారు.
పోడియం వద్దకు చేరుకుని ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాత్రం నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటున్నానని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద రావుభూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తానని ప్రకటించారు.