హోదాతో ఏమౌతుంది?: జగన్-బాబు ఏం చెప్పారు, 'మిత్రుడు' రఘువీరాపై జెసి ఆసక్తికరం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ మంగళవారం నాడు ప్రత్యేక హోదా పైన అట్టుడికింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధానికి దిగాయి. హోదా నుంచి జగన్ మనీ లాండరింగ్, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వరకు ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ప్రత్యేక హోదా వస్తే ఏం లాభమో జగన్ చెప్పే ప్రయత్నాలు చేస్తే, హోదానే తమ మొదటి ప్రధాన్యత అని, అయితే, హోదా కాకుండా ప్యాకేజీ గురించి కూడా ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. హోదాతో పాటు మేలైన ప్యాకేజీ కావాలని బాబు అన్నారు.
హోదా వస్తే ఏం వస్తాయంటే!: జగన్
ప్రత్యేక హోదా లభిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటులు వస్తాయని జగన్ చెప్పారు. తెలిపారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఆదాయ, కస్టమ్స్ సుంకాల నుంచి వంద శాతం మినహాయింపు ఉంటుందని, ఈ లాభాలను 11 రాష్ట్రాలు పొందుతున్నాయన్నారు.
ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుందని, హోదా లేకుంటే 70 శాతం వస్తుందని జగన్ చెప్పారు. 20 శాతం నిధులు ఎందుకు ప్రభుత్వం వద్దనుకుంటోందో అర్థం కావడం లేదని జగన్ పేర్కొన్నారు హోదా కలిగిన రాష్ట్రానికి ఎంత శాతం నిధులు ఇవ్వాలనే దానికి నిబంధనలు లేవన్నారు.
ప్రధానికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వవచ్చని, జమ్మూ కాశ్మీర్ కు 70 వేల కోట్ల రూపాయలు అలా కేటాయించినవేనన్నారు. కోటీ యాభై లక్షల మంది జనాభా కలిగిన జమ్మూ కాశ్మీర్కు అంత మొత్తం కేటాయిస్తే, 5కోట్ల జనాభా కలిగిన ఏపీకి ఎంత నిధులు ఇవ్వాలన్నారు.
ప్రత్యేకహోదా వల్ల వచ్చే సౌకర్యాల వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి పోటెత్తుతాయని, వేల కోట్ల పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందన్నారు. హోదా వస్తే 10 ఏళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ రాయితీ, ఐదేళ్ల పాటు ఇన్ కం ట్యాక్స్ రాయితీ ఉంటుందన్నారు.
ప్రత్యేక హోదాకే తొలి ప్రాధాన్యం కానీ: చంద్రబాబు
తాము ప్రత్యేక హోదాకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే, జగన్ చెప్పినట్లుగా హోదా వస్తే అన్నీ జరగవని అన్నారు. హోదా లేని సమయంలో మంచి ప్యాకేజీ కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ చెప్పినట్లుగా ప్రత్యేక హోదతో ప్రాజెక్టులకు నిధులు రావన్నారు.
జగన్ చెప్పినట్లు హోదాతో ప్రాజెక్టులకు నిధులు రావన్నారు. ఏఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ప్రత్యేక హోదా కింద వచ్చాయో జగన్ తెలుసుకోవాలన్నారు. 2010 నుంచి ప్రత్యేక హోదా కింద వచ్చే నిధులు తగ్గించాలన్నారు. గతంలో 56 శాతం ఇస్తే, ఇప్పుడు 11 శాతం ఇస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదానే తొలి ప్రాధాన్యం అయినప్పటికీ.. అది ఆలస్యమవుతున్నందున కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ కోరడం, తద్వారా ఏపీ అభివృద్ధికి పాటుపడటమే తమ లక్ష్యంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ వచ్చినప్పటికీ ఆ తర్వాత హోదా గురించి డిమాండ్ చేయవచ్చునని టిడిపి మొదటి నుంచి చెబుతోంది.
బిజెపి హామీ
ప్రత్యేక హోదా పైన బిజెపి మాత్రం స్పష్టమైన హామీ ఇస్తోంది. హోదా పైన ఎవరికీ ఆందోళన అవసరం లేదని, బిజెపి తప్పకుండా హామీని నిలబెట్టుకుంటుందని బిజెపి ఎమ్మెల్యేలు చెప్పారు. తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని, తాను బిజెపి శాసన సభా పక్ష నేతగా చెబుతున్నానని విష్ణు కుమార్ రాజు హామీ ఇచ్చారు.
స్వాగతించిన రఘువీరా రెడ్డి
ప్రత్యేక హోదా కోసం శాసన సభలో తీర్మానం చేయడంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం స్పందించారు. తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, వారు బాధ్యతతో చేశారా, లేక ప్రజల ఒత్తిడితో చేశారా అని విమర్శించారు.
రఘువీరా రెడ్డిపై జెసి ఆసక్తికర వ్యాఖ్య
రఘువీరా రెడ్డే కాంగ్రెస్ పార్టీకి చివరి వ్యక్తి అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడినా జగన్, రఘువీరా వ్యతిరేకిస్తున్నారన్నారు. జగన్ రాజకీయ పరిణతి సాధించాలన్నారు. రఘువీరా పార్టీ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరన్నారు.
రఘువీరా పార్టీ అనడంలో తన ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి వాడే (రఘువీరా రెడ్డి) చివరి వ్యక్తి అన్నారు. మళ్లీ మీడియా అపార్థం చేసుకుంటుందేమోనన్న ఆలోచనతో రఘువీరాను 'వాడు' అనడంలో తన ఉద్దేశ్యం తప్పుగా కాదన్నారు. తమ మధ్య ఉన్న బంధం, సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరాను వాడు అని సంబోధించానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు.