వేడివేడిగా: బాబుకు మునిశాపం: జగన్, వీళ్లు కూడా...: బాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సోమవారం శాసనసభలో వాడిగా, వేడిగా మాటల యుద్ధం జరిగింది. రైతు రుణమాఫీపై తాను మాట్లాడుతున్న సమయంలో జోక్యం చేసుకుని చంద్రబాబు వివరణ ఇవ్వడంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. వాస్తవాలు చెప్తే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు నోటి వెంట వాస్తవాలు అసలు రావని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ "మీ తండ్రిగారు కూడా ఇదే మాదిరిగా మాట్లాడారు. వైయస్ అలా మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని నేను చెప్పాను. నీతీనిజాయితీ కారణంగానే నేను ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నాను" అంటూ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"దోషిగా జైల్లో బతికి పరిస్థితి, నువ్వు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. వీళ్లు కూడా నాకు శాపనార్థాలు పెడుతారు. ప్రజాస్వామ్యం కాబట్టి వీళ్లు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఉంది. వ్యవసాయం దండుగ అని నేను అన్నట్లు వైయస్ ఆ రోజుల్లో అన్నారు. నా రాజకీయ జీవితం విలువలతో కూడింది. అసత్యాలూ అబద్ధాలూ మాట్లాడుతున్నారు" అని చంద్రబాబు అన్నారు. చెప్పిందే చేస్తామని, తమకు విశ్వసనీయత ఉదంది, జగన్ లాంటి వాళ్లు కూడా విమర్శించే పరిస్థితి ప్రజాస్వామ్యం వల్ల వచ్చిందని, ప్రజలకు విజ్ఞతా చైతన్యమూ ఉన్నాయని, అందుకే జగన్కు ఆ స్థానం ఇచ్చారని అన్నారు. తప్పులుంటే చూపించండి, చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. దానికి జగన్ ప్రతిస్పందిస్తూ - "చంద్రబాబు పెద్ద కళ్లు చేసుకుని మాట్లాడుతుంటే మాకు కూడా భయమేసింది. చంద్రబాబులా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడే వ్యక్తిని నా జీవితంలో చూడలేదు" అని జగన్ అన్నారు.
జగన్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుని - రుణమాఫీ విషయంలో దొంగ లెక్కలు చూపించవద్దని, అవసరమైతే ఇక్కడ అన్నీ చూపిస్తామని అన్నారు. దొంగలకు అండగా నిలువలేమని ఆయన అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ముందుకు వస్తామని ఆయన అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని, ఓ పద్ధతి ఉండాలని ఆయన అన్నారు. జగన్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, విధానం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా తాను వాస్తవాలు చెప్పినప్పుడు వాటిని అధ్యయనం చేసి సందేహం ఉంటే సమాధానం చెప్తామని ఆయన అన్నారు. కేస్ స్టడీ అవసరం లేదని, రియల్ స్టడీ కావాలని ఆయన అన్నారు. రన్నింగ్ కామెంట్రీగా, తెలియకుండా తెలిసినట్లు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. దొంగ రుణాలు తీసుకున్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వారి గురించి జగన్ మాట్లాడుతున్నారని ఆని ఆయన అన్నారు. రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదని ఆయన అన్నారు. ప్రతిపక్షం సభ్యతతో మాట్లాడాలని ఆయన అన్నారు. అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
రుణమాఫీ వర్తించే జాబితాను కంప్యూటరైజ్ చేశామని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టామని ఆయన అన్నారు. అవినీతి జరిగినప్పుడు కేస్ స్టడీ కావాలని, ఇప్పుడు కాదని ఆయన అన్నారు. రుణమాఫీలో ఎవరికైనా అన్యాయం జరిగితే సరైన సమాచారం ఇవ్వాలని అయన అన్నారు. సభలో వాస్తవాలు మాట్లాడే ధైర్యం మీకు కావాలని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. తప్పులు చేస్తే ఎంతటి పెద్దవారినైనా వదిలేది లేదని ఆయన అన్నారు.
బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ల గురించి, బినామీలు గురించి జగన్ మాట్లాడుతున్నారని, పేదవాళ్ల తరఫున ధర్మకర్తగా తాను పనిచేస్తున్నానని చంద్రబాబు అన్నారు. దోపిడీ చేసే వ్యక్తలు కోసం వైసిపి పోరాడుతోందని విమర్శించారు. విధానంలో తప్పుంటే చూపించండి, సరి చేసుకుంటామని ఆయన అన్నారు. అవాస్తవాలు మాట్లాడి మభ్యపెట్టవద్దని సలహా ఇచ్చారు. రుణమాఫీ చేస్తే బ్యాంకులు పనిచేయవని వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. ఈ సమయంలో వైసిపి శాసనసభ్యులు అభ్యంతరం తెలిపారు.
విషయం తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. రైతులకు మంచి చేయాలని అనుకున్నా వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. రైతు సమస్యల గురించి మాట్లాడుతుంటే విననంటే ఎలా అని జగన్ అడిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన అన్నారు.