సెక్షన్8 కూడా: హోదాపై తీర్మానం, సభలో నెట్టుకున్న ఎమ్మెల్యేలు, చంద్రబాబు కలత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ శాసన సభలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తర్వాత సభను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు బుధవారానికి వాయిదా వేశారు.
'ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి. విభజన చట్టం 2014లో పొందుపర్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను, పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి సాయం, ఆర్థిక లోటుకు నిధులు, విద్యాసంస్థల ఏర్పాటు, హైదరాబాదులో సెక్షన్ 8 అమలు, పోలవరం సహా అన్ని హామీలు నెరవేర్చాలి.' అని తీర్మానం ప్రవేశ పెట్టారు.
ప్రత్యేక హోదా కావాలి: రాజేందర్ రెడ్డి
ఇష్టారీతిన విభజన చేయడం వల్ల ఏపీకి ఎనలేని లోటు జరిగిందని ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమన్నారు. విభజన వల్ల ఏపీ నష్టపోయింది కాబట్టి కేంద్రం ఏపీకి సాయం చేయాలని ఆయన కోరారు. విభజన అన్యాయంగా చేశారన్నారు. నియంతల వలె రాష్ట్రాన్ని విభజించారన్నారు.
విభజన ద్వారా మనం రాజధానిని కూడా కోల్పోయామన్నారు. ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఏ రోజైనా హక్కు హక్కేనని చెప్పారు.
కేంద్ర కేబినెట్ అనుకుంటే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడిగారన్నారు. ఏపీ కూడా అలాగే అడగాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.
నెట్టుకున్న ఎమ్మెల్యేలు, కలత చెందిన చంద్రబాబు
అంతకుముందు ఏపీ శాసన సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలాయి. ఒకరి పైన మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ మృతికి చంద్రబాబు కారణమయ్యాడని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని అలంకరించారని జగన్ చెప్పగా.., తండ్రి వైయస్ మృతదేహం అక్కడ పెట్టుకొని జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని టిడిపి మంత్రులు ఆరోపించారు.
ఓ సమయంలో వైసిపి సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళనలు, నినాదాలు చేశారు. అధికార పార్టీ సభ్యులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల సభ్యులు ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. దీనిపై చంద్రబాబు కలత చెందారు.