టీడీపీకి బీజేపీ నేత వంత: పవన్ కళ్యాణ్కు నిలదీత, మృణాళినికి షాక్
నెల్లూరు: సెక్షన్ 8 పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఇప్పటికే ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు నిలదీస్తున్నారు. తాజాగా బీజేపీ నాయకులు కూడా నిలదీస్తున్నారు. సెక్షన్ 8 పైన పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్నారు.
సెక్షన్ 8 పైన పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. అసలు ఏపీకి పవన్ కళ్యాణ్ ఏం చేశారో చెప్పాలన్నారు. టీడీపీ, బీజేపీలు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు.
మంత్రి మృణాళిని ఘెరావ్
విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణంపై స్థానికుల వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, రైతులు ఇప్పటికే ఆందోళన బాట పట్టగా, ఎలాగైనా ఎయిర్ పోర్టు నిర్మించి తీరాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మంత్రులు తంటాలు పడుతున్నారు.
ఎయిర్ పోర్టు భూసేకరణ అంశానికి సంబంధించి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని, నెల్లిమర్ల నియోజవర్గం ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు సహా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖపట్నం ప్రభుత్వ అతిథిగృహంలో మంగళవారం ఉదయం సమావేశమై చర్చించారు.
సమావేశం జరిగే ప్రాంతానికి విజయనగరం నుంచి అఖిలపక్ష నేతలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. సమీక్ష సందర్భంగా మంత్రి గంటా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామన్నారు.
అభివృద్ధిని అడ్డుకునే క్రమంలో ఎవరు ప్రయత్నించినా నష్టం మనకేన్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు, కంచేరు, రావాడ, ఎ రావివలస, గూడెపువలస, కవులవాడ, కొంగవానిపాలెం గ్రామాల్లో భూములు సేకరించాల్సి ఉందన్నారు.
సమావేశం అనంతరం బయటకు వచ్చిన మంత్రి మృణాళినిని అఖిలపక్ష నేతలు ఘెరావ్ చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కమ్యూనిస్టు నాయకులతో పాటు రైతులు మంత్రి కారును అడ్డుకున్నారు. పోలీసులు కల్పించుకుని ఆందోళన కారులను పక్కకు నెట్టి మంత్రిని పంపించారు.