బెంగళూరులో ఆంధ్ర వ్యాపారి సురేంద్ర కుమార్ కాల్చివేత
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్ర వ్యాపారి సురేంద్ర కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. అతని ఇంటి వద్దనే దుండగులు అతనిపైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సురేంద్ర కుమార్ అక్కడికక్కడే కూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు.
ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సురేంద్ర కుమార్ను దుండగులు ఆయన కార్యాలయం నుంచి బైకులపై అనుసరించినట్లు తెలుస్తోంది. ఇంటికి చేరుకున్న వెంటనే అతనిపైకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
దీపావళి టపాసుల మోతలో సురేంద్ర కుమార్ హత్యకు గురైన విషయాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. సురేంద్ర కుమార్ పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ అతన్ని హత్య చేసి ఉంటుందని భావిస్తున్నారు.
సురేంద్ర కుమార్పై పలు చీటింగ్ కేసులు ఉండేవి. ఆ కేసుల్లో ఆయన కోర్టుల్లో గెలిచారు. అదే సమయంలో ఆయనకు సెక్యూరిటీ ఏజెన్సీలు, మినరల్ వాటర్ వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఆయన మంత్రితో సన్నిహితంగా ఉండేవారు. తర్వాత ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.