ఏప్రిల్ 2న.. కేబినెట్లో భారీ మార్పులు: లోకేష్కు ఐటీ, జగన్కు ఇలా చెక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం గం.9.25 నిమిషాలకు అమరావతి సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
కేబినెట్లో సీఎంతో కలిపి 20 మంది ఉన్నారు. 26 మంది వరకు మంత్రులు ఉండవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఈ కేబినెట్ విస్తరణలో చంద్రబాబు భారీ మార్పులు చేయనున్నారని అంటున్నారు.
లోకేష్కు అవకాశం.. ఆ శాఖలే!
మంత్రివర్గ విస్తరణలో ఏపీ సీఎం, ఈ రోజు (గురువారం) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్కు చోటు దక్కనుంది. ఆయనకు ఐటీ, మున్సిపల్ శాఖ లేదా పంచాయతీరాజ్ శాఖను కేటాయించే అవకాశముంది.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. లోకేష్కు కూడా ఆ శాఖలే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
కాపు, బీసీ, రెడ్డిలకు పెద్దపీట
ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కాపు, బీసీ, రెడ్డిలకు చంద్రబాబు నాయుడు మరింత పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. జగన్ను ఢీకొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గానికి, కాపు రిజర్వేషన్ల రగడ నేపథ్యంలో కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేందుకు వారికి, అలాగే, బీసీలకు పెద్దపీట వేయనున్నారు.
శాఖల మార్పు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద మరో ఒకటి రెండు శాఖలు ఉండే అవకాశముంది. కొందరు మంత్రుల శాఖల్లో కోత విధించనున్నారు. అలాగే మరికొందరి శాఖలు మార్చనున్నారు.
ఉద్వాసన, కొత్త వారికి ఛాన్స్
నలుగురైదుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు. ఇప్పటికే ఆ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే, కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. కొత్త వారిలో నారా లోకేష్, అఖిల ప్రియలకు అవకాశం దక్కనుంది.