ఆంధ్రప్రదేశ్ రాజధాని: అక్రమ లేఅవుట్లపై కొరడా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. విజయవాడ సీఆర్డీఏ పరిధిలో అక్రమంగా చేసిన లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత లేఅవుట్ల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
రాజధాని గ్రామాల్లో భూమి ధరలు తగ్గడానికి అక్రమ లేఅవుట్లే కారణమని భావించిన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అధికారులు తుళ్లూరు నుంచి విజయవాడకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ అక్రమ లేఅవుట్లను పరిశీలిస్తున్నారు
నవ్యాంధ్ర రాజధాని కోసం భూసేకరణ ద్వారానే ముందుకెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల కోసం భారీ ఎత్తున భూమి అవసరం కానున్న నేపథ్యంలో భూసేకరణకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
అందులో భాగంగా భూసేకరణకు ప్రతిబంధకంగా మారిన పలు అంశాలను తొలగిస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూనిర్వాసితులకు సమంజసమైన పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం పొందే హక్కు-2013 పై సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గురువారం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ జీవోనెం.16ను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం చేపట్టే పలు ప్రాజెక్టులు, సంస్థల కోసం భారీ ఎత్తున భూమిని సమీకరించాలని, సేకరించాలని యోచిస్తున్న ఏపీ ప్రభుత్వం, భూసేకరణ చట్టాన్ని సవరించాలని కేంద్రానికి నివేదించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 31న చట్టంలో మార్పులు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్ తేవడంతోపాటు తాజాగా సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా సవరణ నోటిఫికేషన్తో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా భూమిని సేకరించాలంటే సామాజిక ప్రభావాన్ని అధ్యయనం చేయాలన్న నిబంధన నుంచి మినహాయింపు లభించనుంది. భూసేకరణకు ముందే పునరావాసం కోసం ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనక్కర లేదు. గ్రామసభల్లో జరిగే అభిప్రాయ సేకరణలో నిర్వాసితులు నిర్ణీత సంఖ్యలో హాజరుకావాలనే నిబంధన కూడా తొలగిపోయింది.
ఒక్కరోజే 1300 ఎకరాలు సమీకరణ
తుళ్లూరు మండలంలో గురువారం ఒక్కరోజే 1300 ఎకరాలకు రైతులు అంగీకారపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జాన్ నెలాఖరు నాటికి సింగపూర్ ప్రభుత్వం రాజధాని నమూనాను సిద్ధం చేస్తుందని తెలిపారు. గ్రామాలను కదిలించకుండా డిజైన్ చేయాలని చంద్రబాబు సింగపూర్ బృందాన్ని కోరారని తెలిపారు.
అన్ని గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు ఒకేసారి రుణ మాఫీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేలపాడు, శాఖమూరు,ఐనవోలు తుళ్లూరు రైతులు అంగీకారపత్రాలను అందజేశారు.