ఆ రెండు ఘటనలు: చలించిపోయిన చంద్రబాబు, ఏమైందంటే?
కర్నూల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడ గుంభనంగా ఉంటారు. ఎంత పెద్ద ఘటనైనా చంద్రబాబునాయుడు చలించిపోయే సంఘటనలు అరుదుగా ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన రెండు ఘటనలు చంద్రబాబునాయుడు చలించిపోయారు. అభాగ్యులకు అండగా ఉంటానని హమీ ఇచ్చారు.
బాలల భవిష్యత్తు కోసం కైలాశ్ సత్యార్థి ప్రారంభించిన 'భారత్ యాత్ర' మంగళవారం కర్నూలు వద్ద ఏపీలోకి ప్రవేశించింది. కర్నూల్లో సభను నిర్వహించి కైలాష్ సత్యార్థికి ఏపీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.
అయితే కర్నూల్లో నిర్వహించిన సభలో విద్యార్థులతో చంద్రబాబునాయుడు ముఖాముఖి నిర్వహించారు. అయితే ఈ సభలో ఓ యువతి తన విషాదగాధ చెప్పడంతో చంద్రబాబునాయుడు చలించిపోయారు. అప్పటికప్పుడు ఆ యువతికి అండగా ఉండాలని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారు.
చలించిన చంద్రబాబు
రాయలసీమ జిల్లాల్లో ఇటీవల చోటుచేసుకొన్న రెండు ఘటనల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చలించిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి భార్య సులోచన, కుమార్తెలు లక్ష్మీప్రత్యూష, సాయిప్రతిభను సుత్తితో బాది చంపి, తాను ఆత్మహత్య చేసుకొన్నారు. రామసుబ్బారెడ్డి మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు అండగా ఉంటానని చంద్రబాబు హమీ ఇచ్చారు. అనంతపురం సభలో ఈ విషయాన్ని బాబు ప్రకటించారు. వెంటనే అమలు చేశారు. కర్నూల్ జిల్లాలో కైలాష్ సత్యార్థి సభలో కూడ ఓ యువతి తన విషాధగాధ చెప్పడంతో చంద్రబాబునాయుడు స్పందించారు.
ప్రేమ పేరుతో అమ్మేశాడు
‘కర్నూలు జిల్లాకు చెందిన నేను 9వ తరగతి దాకా చదువుకొన్నాను. ఓ యువకుడ్ని ప్రేమించి అతనితో పాటు వెళ్లిపోయాను. ఆ యువకుడు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్లి రూ.35 వేలకు అమ్మేశాడు. షాక్ నుంచి తేరుకునేలోపే ముంబై రెడ్లైట్ ఏరియాలో ఉన్నాను. కొంత కాలానికి ఓ కస్టమర్ ద్వారా తప్పించుకుని కర్నూలు చేరుకున్నానని ఆ యువతి చెప్పింది.. ప్రస్తుతం కర్నూలు సెంట్రల్ హోంలో ఉండి 10వ తరగతి చదువుతున్నాను. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని'' వేదికపైనే కన్నీటిపర్యంతమైంది.
రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని బాబు హమీ
ఆ బాలికను చూసి చలించిపోయిన సీఎం వెంటనే లేచి ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆమె పేరున రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రకటించారు. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన మరో చిన్నారికి కూడ రూ.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు.
ఉన్మాదం పెరగడం వల్లే ఈ పరిస్థితి
అనంతపురం జిల్లాలో రామసుబ్బారెడ్డి కూతురు లక్ష్మీప్రసన్న దయనీయస్థితి పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు ఆమెను చదివిస్తానని బాబు హమీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన లక్ష్మీ ప్రసన్నను చదివిస్తానని చంద్రబాబునాయుడు హమీ ిచ్చారు. సమాజంలో ఉన్మాదం పెరిగితే ఈ రకమైన ఘటనలు చోటుచేసుకొంటాయని అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యానించారు.