దేవినేని ఉమపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిలో అధికారులు, కాంట్రాక్టు సంస్థలు సక్రమంగా పనిచేయకపోవడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశం పూర్తికాగానే అన్నీ వదిలేస్తున్నారంటూ మంత్రి దేవినేని ఉమపై చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. నిర్ణీత కాల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని బాబు ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం నాడు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్ష నిర్వహిస్తారు.ఇందులో భాగంగానే ఇవాళ నిర్వహించిన సమీక్షలో బాబు మంత్రి దేవినేని ఉమతో పాటు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఎర్త్ వర్క్ నిర్మాణం విషయంలో లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఎర్త్ వర్క్ ఒక్కరోజు నిలిచిపోతే కోట్లాదిరూపాయాల నష్టం వాటిల్లుతోంది. అయితే నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగానే పనులు జరగాలని భావించినా ఎందుకు పనులు పూర్తి చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు అనుసరిస్తున్నతీరుపై బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ సమావేశం మొత్తం హాట్ హాట్ గా సాగింది. సమీక్ష సమావేశం నుండి వెళ్ళిపోగానే అన్నీ వదిలేస్తున్నారంటూ మంత్రి దేవినేని ఉమపై బాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా కాని, నిర్ణీత కాల వ్యవధిలోనే పనులను పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాపర్ డ్యాం నిర్మాణం, డిజైన్లు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. అంతా మాటలు చెబుతున్నారు. పనులు జరగడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. మాటలు చెప్పడం మానేసి పనులు చేయాలని బాబు ఆదేశించారు.