చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు, వచ్చి కలిశారు: కలాంతో అనుబంధంపై బాబు
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కలాంతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఆయన సచివాలయం వద్ద మాట్లాడారు.
శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం దేసానికి విశిష్ట సేవలు అందించారన్నారు. ఆత్మీయ వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. నీతి, నిజాయితీగా పట్టుదలతో కలాం పని చేశారన్నారు.
Photos: బాబుతో కలాం
అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. 2002లో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయాలని తాను నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చానని చెప్పారు. ఆయన అయితేనే మంచి పేరు వస్తుందని, దేశ ప్రతిష్ట పెరుగుతుందని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో తన పాత్ర ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలిపిరిలో తన పైన దాడి జరిగినప్పుడు రాష్ట్రపతిగా ఉన్న కలాం తనను నేరుగా వచ్చి పరామర్శించారని, దానిని జీవితంలో మరిచిపోలేనని చెప్పారు.
ఆయన మాజీ రాష్ట్రపతి అయ్యాక అనంతపురం వచ్చారని గుర్తు చేసుకున్నారు. అయన భారత అత్యున్నత పురస్కారం భారతరత్న వచ్చిందని, ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇచ్చాయన్నారు. మనం ప్రపంచంలో ఏ దేశానికంటే తక్కువ కాదని కలాం చెప్పేవారన్నారు.
తాను చనిపోతే సెలవు ఇవ్వవద్దని అబ్దుల్ కలాం చెప్పారని, అంతేకాదని, తాను చనిపోయిన సమయంలో మరోరోజు అదనంగా పని చేయాలని కలాం చెప్పారని గుర్తు చేశారు. సెలవు ఇవ్వొద్దనేది కలాం కోరిక అన్నారు. సింగపూర్ మాజీ ప్రధాని కూడా గతంలో ఇదే విషయం చెప్పారన్నారు.