అద్దె ఇల్లు దొరకట్లేదు, మనం ఏపీకి వెళ్లిపోదాం: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శాసన మండలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా కొత్త రాజధానికి వెళ్లాలని అన్నారు. వెళ్లే వాళ్లందరికీ వసతులు కష్టమేనని, కానీ తప్పదని అభిప్రాయపడ్డారు.
విజయవాడ, గుంటూరులలో అద్దె ఇల్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త రాజధాని నిర్మాణం ముఖ్యమన్నారు. దానిని తప్పకుండా నిర్మిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామి చెప్పారు.
కొత్త రాజధాని కోసం వనరులు సేకరిస్తున్నామన్నారు. కొత్త రాజధానికి వీలైనంత త్వరగా వెళ్లలన్నారు. వెళ్లే వారికి సౌకర్యాలు ఇబ్బందే అన్నారు. మన రాజధానికి వెళ్లే సమయం ఆసన్నమైందన్నారు. పిల్లల చదువుల కారణంగా కొత్త రాజధానికి వచ్చేందుకు కొంత ఇబ్బంది ఉంటుందన్నారు.
హైదరాబాద్ - ముంబై - బెంగళూరులతో కొత్త రాజధానిని అనుసంధానం చేస్తామన్నారు. కర్నూలు అమరావతి మధ్య ఆరు లైన్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. రాయలసీమను ఉద్యాన హబ్గా మారుస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున సీమను ప్రమోట్ చేస్తామన్నారు.
పట్టిసీమతో గోదావరి జిల్లాలకు నష్టం కలిగించమన్నారు. గోదావరి నీటిని వాడుకుంటే కరువు నివారించవచ్చునని చెప్పారు. గోదావరి నుండి మూడు టీఎంసీల నీరు వృథా అవుతుందన్నారు. దానిని వినియోగించుకుంటే కరువు నివారించొచ్చన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయ్యే వరకు పట్టిసీమ నీటిని గోదావరికి ఇస్తామన్నారు. రాజకీయం నిరంతరం కొనసాగే చర్య అని, వయసు మీరినా రాజకీయం చేయకుండా కూర్చోలేరన్నారు.